హైదరాబాద్: పోలీస్ అమర వీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా హైదరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ల పరిధిలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. రక్తదాన శిబిరాన్ని నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు వారం రోజులు పోలీసు అమరవీరుల వారోత్సవాలు నిర్వహిస్తామని తెలిపారు. పోలీసులు, పారా మిలటరీ, అస్సాం రైఫిల్స్, సిఆర్పిఎఫ్, బిఎస్ఎఫ్, సిటీ పోలీసులు, ఆర్మ్డ్ రిజర్వు పోలీసులు విధి నిర్వహణలో అసువులు బాసారని అన్నారు. అమరవీరుల కుటుంబాలకు అండగా ఉంటామని తెలిపారు. రక్తదాన శిబిరానికి సహకరించిన వైద్యులు, రెడ్క్రాస్ సొసైటీకి కృతజ్ఞతలు తెలిపారు. దాదాపు 350కి పైనా పోలీసులు రక్తదానం చేశారు. రక్తదానం చేసి మరొకరి ప్రాణం నిలుపాలని, రక్తదానం చేసేందుకు ప్రజలు ముందుకు రావాలని కోరారు.
దేశం కోసం ప్రాణాలు త్యాగం చేశారు : మహేష్ భగవత్, రాచకొండ పోలీస్ కమిషనర్
పోలీసు అమరవీరులు దేశం కోసం తమ ప్రాణాలను త్యాగం చేశారని రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ అన్నారు. అంబర్పేట పోలీస్ హెడ్క్వార్టర్స్లో మంగళవారం మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. 1,500 మంది పోలీసులు రక్తదానం చేశారు. ఈ సందర్భంగా రాచకొండ సిపి మహేష్ భగవత్ మాట్లాడుతూ రక్తదానం చాలా గొప్ప ఆశయమని అన్నారు. రక్తదానం వల్ల అమరులను మరోసారి గుర్తు చేసుకుంటామని అన్నారు. వారోత్సవాల సందర్భంగా వివిధ కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్లాన్ తయారు చేశామని తెలిపారు. కార్యక్రమంలో ఎడిసిపి శంక్నాయక్, సమీర్, ఎసిపి హరినాథ్, వైద్యులు పిచ్చిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.