రూ.50లక్షల విలువైన వస్తువులు స్వాధీనం
రెండు టన్నుల విత్తనాలు, డిసిఎం, మిషన్
వివిధ బ్రాండ్లకు సంబంధించిన ప్యాకెట్లు స్వాధీనం
విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించిన సిపి మహేష్ భగవత్
మన తెలంగాణ/హైదరాబాద్: నకిలీ పత్తి విత్తనాలు తయారు చేసి విక్రయిస్తున్న ముఠాను రాచకొండ ఎస్ఒటి పోలీసులు అరెస్టు చేశారు. నలుగురు నిందితులను అరెస్టు చేయగా ,మరొకరు పరారీలో ఉన్నారు. అరెస్టు అయిన వారి వద్ద నుంచి రూ.32,44,444, 30 విలువైన 51.28 కిలోల విత్తనాల ప్యాకెట్లు, ప్యాకింగ్ కవర్లు, డిసిఎం వ్యాన్, సీడ్ ప్రాసెసింగ్ మిషన్, ప్యాకింగ్ మిషన్, కలర్ టిన్నును స్వాధీనం చేసుకున్నారు. ఎల్బి నగర్లోని రాచకొండ సిపి క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిపి మహేష్ భగవత్ ఈ ఘటన వివరాలు వెల్లడించారు. గద్వాల జిల్లా, వడ్డేపల్లి మండలం, శాంతినగర్కు చెందిన మన్యం లక్ష్మినారాయణ నగరంలోని నాగోల్ సహారా ఎస్టేట్లో స్థిరపడి వ్యాపారం చేస్తున్నాడు. ఎపిలోని కర్నూలు జిల్లాకు చెందిన పింజరి యూసుఫ్ భాషా డిసిఎం డ్రైవర్, మాలదాసరి సురేష్ క్లీనర్, నాగోల్కు చెందిన వెంపటి బాచీ వ్యాపారం చేస్తున్నాడు.
మరోనిందితుడు హుస్సేన్ సాహెబ్ పరారీలో ఉన్నాడు. లక్ష్మినారాయణ గత మూడేళ్ల నుంచి నకిలీ విత్తనాల వ్యాపారం చేస్తున్నాడు. రైతులకు మాయమాటలు చెప్పి నకిలీ విత్తనాలు విక్రయిస్తున్నాడు. తపస్య ఆగ్రో టెక్ పేరుతో సంస్థను మేడ్చెల్ మల్కాజ్గిరిలో సంస్థను స్థాపించి వ్యాపారం చేస్తున్నాడు. వ్యాపారం చేసేందుకు ఎలాంటి లైసెన్స్ లేదు. నద్యాలలో కాటన్ సీడ్స్ వ్యాపారం చేయగా నష్టాలు వచ్చాయి. నకిలీ విత్తనాలు విక్రయించడంతో గతంలో ఖమ్మం జిల్లాలో కేసు నమోదయింది. లయన్, రఘు, కావ్య, బిల్లా, అరుణోదయ, మేఘన45, పావని పేరుతో నకిలీ విత్తనాలు తయారు చేసి విక్రయిస్తున్నారు. నకిలీ విత్తనాలు తయారు చేసిన తర్వాత భాషా, బాచీ కలిసి వివిధ ప్రాంతాలకు తీసుకు వెళ్లి రైతులకు మాయమాటలు చెప్పి విక్రయిస్తున్నారు. ఖమ్మంలో నకిలీ విత్తనాలు విక్రయించగా టేకులపల్లి, బూర్గంపాడు, అశ్వరావుపురం పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. నిషేధిత బిటీ కాటన్ సీడ్స్ను కర్నూలు జిల్లాకు చెందిన హుస్సేన్ సాహెబ్ వద్ద నుంచి సేకరించి వాటిని రీప్రాసెస్ చేసి విక్రయిస్తున్నారు. రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్భగవత్, ఎస్ఒటి ఎడిసిపి సురేందర్ రెడ్డి పర్యవేక్షణలో పోసులు నిందితులను అరెస్టు చేశారు.