ఎనిమిది మంది అరెస్టు, రూ. 35.55 లక్షల విలువైన ఔషధాలు స్వాధీనం
అత్యవసరాన్ని క్యాష్ చేసుకుంటున్న దుండగులు, రెమిడెసివర్, కోవిఫర్, ఆక్ట్రేమా, ఫాబిప్లూ తదితర ఔషధాలను 40వేల నుంచి లక్ష రూపాయల వరకు అమ్ముతున్న వైనం
మన తెలంగాణ/ సిటిబ్యూరో: కోవిడ్ రోగులకు ఉపయోగించే అత్యవసర మందులను బ్లాక్ మార్కెట్లో విక్రయిస్తున్న ఎనిమిది మందిని నగర సౌత్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు, చాదర్ఘాట్ పోలీసుల సాయంతో అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ. 55,000నగదు, రెమిడిసివిర్ ఇంజక్షన్లు, ఆక్టెమ్రా ట్యాబ్లెట్లు, ఇంజక్షన్లు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న వాటి విలువ రూ. 35,55,000 ఉంటుంది. మంగళవారం నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ తన కార్యాలయంలో కేసు వివరాలు వెల్లడించారు. సికింద్రాబాద్కు చెందిన వెంకట సుబ్రహ్మణ్యం అలియాస్ పాణి సర్జికల్ వ్యాపారం చేస్తున్నాడు. సంతోష్కుమార్, ఎండి షకీర్, కిషోర్, రాహుల్ అగర్వాల్, గగన్ కురానా, సైఫ్ అలీ మహ్మద్, ఫిర్దోస్ మహ్మద్ కలిసి బ్లాక్మార్కెట్ దందా చేస్తున్నారు. కరోనా వైరస్ రోజు రోజుకు వ్యాపిస్తుండడంతో చికిత్సకు వాడే మందులకు డిమాండ్ ఎక్కువ ఉంది. దానిని సొమ్ము చేసుకునేందుకు నిందితులు మందులు, ఇంజక్షన్లు బ్లాక్లో విక్రయిస్తు అధికంగా డబ్బులు సంపాదిస్తున్నారు. రెమిడిసివీర్ డ్రగ్స్ను హెటీరో కంపెనీ తయారు చేస్తుండగా శ్రీ మెడిక్యూర్ ప్రాడక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ యజమాని వెంకటసుబ్రహ్మణ్యం స్టాక్ తెప్పించాడు. తనకు తెలిసిన సంతోష్కు డ్రగ్ను రూ.3,500కు విక్రయిస్తున్నాడు.
సంతోష్ వాటిని కిషోర్, ఎండి షకీర్కు రూ.6,000కు వారు రాహుల్కు రూ.8,000కు విక్రయిస్తున్నారు. రాహుల్ వాటిని అవసరం ఉన్న వారికి బ్లాక్మార్కెట్లో రూ.15,000 నుంచి రూ.18,000 విక్రయిస్తున్నాడు. అత్యవసరం ఉన్న వారికి రూ. 30,000 నుంచి రూ. 40,000కు విక్రయిస్తున్నారు. కోవిఫర్ ధర రూ. 5,400 ఉండగా రూ. 30 నుంచి 40వేల వరకు, ఆక్టేమ్రా 400ఎంజిని 9ని రూ. 40,000 నుంచి లక్ష రూపాయల వరకు, ఫాబిఫ్లూ 180 స్ట్రిఫ్స్ను రూ. 3,500 5,000వరకు, కోవిడ్ ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లు 100 పీసులు రూ. 1,200 1,800 వరకు విక్రయిస్తున్నారు. టాస్క్ఫోర్స్ ఎడిసిపి చక్రవర్తి పర్యవేక్షణలో ఇన్స్పెక్టర్ రాఘవేంద్ర, ఎస్సైలు నరేందర్, శ్రీశైలం, ఎండి తకియుద్దిన్, సిబ్బంది నిందితులను పట్టుకున్నారు. ఆస్పత్రుల్లోనే విక్రయించాలి. కోవిడ్ డ్రగ్స్ను ఆస్పత్రులకు మాత్రమే విక్రయించాలని, బయటి వ్యక్తులకు విక్రయించవద్దని నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ స్పష్టం చేశారు. కరోనా పాజిటివ్ వచ్చిన వారి బంధువుల అనుమతితో మాత్రమే వైద్యులు వాడుతారని తెలిపారు.
Police seized rs 35.55 lakhs covid drugs in Hyderabad