రంగారెడ్డి : గుర్తు తెలియని దుండగులు ఓ డాక్టర్ను కిడ్నాప్ చేసిన సంఘటన సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో తీవ్ర కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. బురకాలు ధరించి గుర్తు పట్టకుండా జాగ్రత్త పడిన దుండగులు, డాక్టర్ సహాయకునికి నోటికి ప్లాస్టర్ వేసి బాత్ రూమ్లో బంధించి కిడ్నాప్కు పాల్పడ్డారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు సరిహద్దు రాష్ట్ర పోలీసులను సైతం అప్రమత్తం చేశారు. బుధవారం ఉదయం కిడ్నాపర్లు అనంతపురం జిల్లా మీదుగా వెళ్తున్నట్లు ఆ జిల్లా ఎస్పీ సత్య యేసుబాబుకు సమాచారం రావడంతో ఆయన రాప్తాడు పోలీసులను అప్రమత్తం చేశారు. రాప్తాడు జాతీయ రహదారిపై కిడ్నాపర్ల వాహనాన్ని గుర్తించిన పోలీసులు వెంబడించి పట్టుకున్నారు. కిడ్నాపర్లు వైద్యుడి కాళ్లు, చేతులు కట్టేసి. కళ్లకు గంతలు కట్టి కారులో బెంగళూర్ వైపు తీసుకెళ్తున్నట్లు గుర్తించారు. ఇద్దరు కిడ్నాపర్లను అదుపులోకి తీసుకోగా మరో ఇద్దరు పరారైనట్లు సమాచారం. వీరిని పట్టుకునేందుకు పది మంది ప్రత్యేక పోలీసు బృందాలు రంగంలోకి దిగాయి. పట్టుబడిన వారి వద్ద డమ్మీ తుపాకీని సైతం పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.