Wednesday, April 24, 2024

ఇటు దేవుళ్ళు, అటు బహుజనులు ఇరకాటంలో ఆర్‌ఎస్‌ఎస్

- Advertisement -
- Advertisement -

2021లో అమెరికా చెందిన ‘పూ’ విశ్లేషణా సంస్థ మన దేశంలో ఒక సర్వే నిర్వహించింది. దానిలో వెల్లడైన కొన్ని అంశాలను చూస్తే ఎందుకు దేవుళ్ల కోసం రాజకీయ పార్టీలు వెంపర్లాడుతున్నదీ అర్ధం అవుతుంది. 2019 నవంబరు 17 నుంచి 2020 మార్చి 23వ తేదీ వరకు మన దేశంలో 29,999 మందిని సర్వే చేసింది. వారిలో 22,975 హిందువులు, 3,330 ముస్లింలు, 1,7 82 సిక్కులు, 1,011 క్రైస్తవులు, 719 బౌద్ధులు, 109 జైనులు, 67 మంది ఏమతం లేని వారు ఉన్నారు. 2019 ఎన్నికలు జరిగిన తరువాత, జమ్మూకశ్మీర్ రాష్ర్టం, ఆర్టికల్ 370 రద్దు తరువాత జరిపిన సర్వే ఇది. విశ్లేషణలో కొన్ని అంశాలు ఇలా ఉన్నాయి. వీటిని పరమ ప్రమాణంగా తీసుకోవాలని చెప్పటం లేదు గానీ దేశంలో నెలకొన్న ధోరణులకు ఒక సూచికగా తీసుకోవచ్చు. 2019 ఎన్నికల్లో పార్టీల వారీగా హిందువులు బిజెపికి 49 శాతం, కాంగ్రెస్‌కు 13 శాతం వేశారు. ముస్లింలలో కాంగ్రెస్‌కు 30, బిజెపికి 19 శాతం, క్రైస్తవుల్లో కాంగ్రెస్‌కు 30, బిజెపికి 10%, సిక్కుల్లో కాంగ్రెస్‌కు 33, బిజెపికి 19, బౌద్ధుల్లో బిజెపికి 29, కాంగ్రెస్‌కు 24 శాతం మంది వేశారు.

ఈ ధోరణి 2014 నుంచి ఉన్నదని చెప్పవచ్చు. అందువల్లనే ఎవరి ఓటు బాంకును వారు కాపాడుకొనేందుకు చూడటంతో పాటు హిందువుల ఓట్ల కోసం కాంగ్రెస్ నేతలు, మైనారిటీల ఓట్ల కోసం బిజెపి నేతలు వెంపర్లాడటం లేదా సంతుష్టీకరణకు పూనుకున్నారని చెప్పవచ్చు. దేశంలో ప్రజాస్వామిక వ్యవస్థ పట్ల విశ్వాసం తగ్గుతున్నదని ఈ సర్వే అంకెలు చెబుతున్నాయి. మొత్తంగా ప్రజాస్వామ్య నాయకత్వం కావాలని 46% మంది చెప్పగా దానికి విరుద్ధమైన బలమైన నేత కావాలని చెప్పిన వారు 48 శాతం మంది ఉన్నారు. హిందువుల్లో మొదటి దానికి 45 శాతం మద్దతు పలకగా రెండవ దానికి 50 శాతం మంది ఉన్నారు. మిగతా మతాల వారిలో ప్రజాస్వామిక వ్యవస్థ కావాలని కోరిన వారి శాతం 49 నుంచి 57% వరకు ఉండగా, బలమైన నేత కావాలని చెప్పిన వారు 37 నుంచి 47శాతం వరకు ఉన్నారు. బలమైన నేత కావాలని స్త్రీలు 48, పురుషులు 49 శాతం మంది కోరుకోగా ప్రజాస్వామ్యం కావాలని చెప్పిన వారు 44, 47 శాతాల చొప్పున ఉన్నారు. ఈ కారణంగానే గట్టి నిర్ణయాలు తీసుకోవటం నరేంద్ర మోడీ వల్లనే జరుగుతుందని బిజెపి వ్యూహకర్తలు అలాంటి ప్రచారాన్ని ముందుకు తెచ్చినట్లు స్పష్టం అవుతోంది. సంస్కరణలను వేగంగా అమలు జరపటం గురించి తగ్గేదే లేదని, అదానీ కంపెనీల గురించి విచారణకు అంగీకరించేది లేదన్న వైఖరి, రాష్ట్రాలకు చెందిన సాగు రంగంపై వాటితో సంప్రదించకుండా మూడు చట్టాలను రుద్దేందుకు పూనుకోవటం. ఆర్టికల్ 370ని కశ్మీర్ అసెంబ్లీలో చర్చించకుండా రద్దు వంటి వాటిని ‘గట్టి నాయకుడి’లో చూడవచ్చు. చరిత్రలో జర్మన్లు హిట్లర్‌లో గట్టి నేతను చూశారు.

ఏడు దశాబ్దాల స్వాతంత్య్రం తరువాత జనం మత వ్యవహారాల్లో రాజకీయ పార్టీల, నేతల జోక్యాన్ని సమర్ధించేవారు అన్ని మతాల్లో మూడింట రెండువంతుల మంది ఉండటం ఆందోళన కలిగించే అంశం. దీన్ని అవకాశంగా తీసుకొని కొన్ని శక్తులు నిస్సిగ్గుగా మతాన్ని రాజకీయాన్ని మిళితం చేస్తున్నాయి. మత పెద్దలమని చెప్పుకొనే వారు రాజకీయాల్లో చక్రం తిప్పుతున్నారు. పూ సర్వే ప్రకారం మొత్తంగా చూసినపుడు 62% మంది మత వ్యవహారాల్లో రాజకీయ పార్టీల ప్రమేయాన్ని సమర్ధించారు. హిందూ మతంలో సమర్ధించిన వారు 64% కాగా వద్దన్న వారు 29% ఉన్నారు. సమర్ధించిన వారు ఇతర మతాల్లో 59 నుంచి 42 శాతం వరకు ఉన్నారు.రాజకీయ పార్టీల ప్రమేయం ఉండకూడదని చెప్పినవారు ఇతర మతాల్లో 35 నుంచి 52% వరకు ఉన్నారు. ఈ కారణంగానే హిందూత్వశక్తులు తమ అజెండాను అమలుచేస్తున్నాయి. ముస్లింలలో రాజకీయ పార్టీల ప్రమేయం ఉండాలన్న వారు 59% వద్దన్నవారు 35శాతం. అంటే మెజారిటీ మైనారిటీ మతాల్లో మతాన్ని ఎంతగా ఎక్కించిందీ అర్ధం చేసుకోవచ్చు. మెజారిటీ మతతత్వం ఎంత ప్రమాదకరమో మైనారిటీ మతతత్వం కూడా అంతే ప్రమాదకరం.

ఇక ఏ దేవుడు, దేవత పలుకుబడి లేదా ప్రభావం ఎక్కువగా ఉందో కూడా పూ విశ్లేషణలో ఆసక్తికర అంశాలున్నాయి. శివుడు 44 శాతంతో ఆలిండియా దేవుడిగా అగ్రస్థానంలో ఉండగా, హనుమాన్ 35, గణేష్ 32, లక్ష్మి 28, కృష్ణ 21, కాళి 20, రాముడు 17, విష్ణు 10, సరస్వతి 8, ఇతరులు 22 శాతంతో ఉన్నారు. చిత్రం ఏమిటంటే శ్రీరాముడి గురించి సంఘపరివార్ పెద్ద ఎత్తున ప్రచారం చేసినప్పటికీ మిగతా దేవుళ్లతో పోలిస్తే ఎక్కడా పెద్దగా ప్రభావం చూపటం లేదని పూ చెబుతోంది. మధ్యభారత్‌లో మాత్రమే పైన పేర్కొన్న తొమ్మిది మంది జాబితాలో రాముడు గరిష్ఠంగా 27 శాతంతో ఐదవ స్థానంలో ఉన్నాడు. ఉత్తరాదిన 20, తూర్పున 15, దక్షిణాదిన 13, పశ్చిమాన 12, ఈశాన్యంలో ఐదుశాతం మంది అనుచరులతో ఉన్నాడు. ఉత్తరాదిన 43 శాతంతో హనుమాన్ తరువాత 41 శాతంతో శివుడు, గణేష్ ఉన్నారు. ఈశాన్యంలో కృష్ణుడు 46 శాతం, తూర్పున 34 శాతంతో కాళి, 32 శాతంతో లక్ష్మి, పశ్చిమాన 46 శాతంతో గణేష్ అగ్రస్థానంలో ఉన్నారు. దేశంలోని మిగతా ప్రాంతాల వారితో పోలిస్తే దక్షిణాదిన ప్రాంతీయ దేవతలు గణనీయంగా ప్రభావం కలిగి ఉన్నారు. మురుగన్ 14, అయ్యప్ప 13, మీనాక్షి ఏడు శాతం మందిని కలిగి ఉన్నారు.

శివుడు 39 శాతంతో అగ్రస్థానంలో ఉన్నాడు. ఆర్‌ఎస్‌ఎస్ అనుకున్నట్లుగా లోకం నడవదు. రామచరిత మానస్ లో వెనుకబడిన తరగతులవారిని కించపరిచినట్లు వచ్చిన వివాదం తరువాత ఆ సామాజిక తరగతులను సంతుష్టీకరించేందుకు ఆర్‌ఎస్‌ఎస్ నేత మోహన్ భగవత్ రంగంలోకి దిగారన్నది ఒక అభిప్రాయం. హిందూత్వ శక్తులు, వారిని అనుసరించేవారిలో ఒక వైరుధ్యం ఉంది. తాము చెప్పే హిందూత్వ సనాతనమైనదని దాని లో కులాలు లేవని జనాన్ని నమ్మించేందుకు బిజెపి చూస్తున్నది. గతేడాది అక్టోబరు 8వ తేదీన నాగపూర్‌లో ఒక పుస్తకావిష్కరణ సభలో మాట్లాడుతూ వర్ణ, కుల వ్యవస్థలను హిందూయిజం నుంచి తొలగించాలని, అది పాపమని కూడా మోహన్ భగవత్ చెప్పారు. ఆ సభ గురించి లోక్‌సత్తా పత్రిక రాసిన వార్తలో ఆర్‌ఎస్‌ఎస్ అధిపతి బ్రాహ్మల గురించి ప్రస్తావించినట్లు రాశారని ఆ పత్రిక సంపాదకుడు, నాగపూర్ విలేకరి మీద సంఘపరివార్‌కు చెందిన వారు కేసులు దాఖలు చేశారు. ఒక కులం గురించి భగవత్ ప్రస్తావించని మాట నిజమే అయినా కుల వ్యవస్థను సృష్టించింది ఎవరు? లేక దానికి అదే పుట్టిందా అన్న ప్రశ్నలకు సమాధానం చెప్పాలి.

వర్ణ వ్యవస్థ సృష్టి బ్రాహ్మణవాదులపనే అనే అభిప్రాయం బలంగా ఉండటంతో సదరు విలేకరి బ్రాహ్మణుల పేరు ప్రస్తావించి ఉండవచ్చు. చిత్రం ఏమిటంటే అదే మోహన్ భగవత్ ఈ ఏడాది ఒక దగ్గర మాట్లాడుతూ కులాలను సృష్టించింది పండితులే అని సెలవిచ్చారు. వెనుకబడిన తరగతులు, దళితులు, మహిళలను కించపరుస్తూ తులసీదాస్ రామచరిత మానస్‌లో రాశారన్న విమర్శలను సమాజవాదీ, ఆర్‌జెడి నేతలు ముందుకు తెచ్చిన పూర్వరంగంలో భగవత్ ఈ మాటలు చెప్పారని అనుకోవచ్చు. ఈ దేశంలో పండితులు అంటే బ్రాహ్మలే కదా! దాని మీద ఆర్‌ఎస్‌ఎస్‌లోని బ్రాహ్మలు, వెలుపల ఉన్న వారిలో కూడా గగ్గోలు తలెత్తటంతో నష్ట నివారణగా ఒక వివరణ ఇచ్చారు. అదే మంటే పండిట్ అంటే ఆంగ్లంలో బ్రాహ్మలు కాదు, ఆంగ్లం, మరాఠీలో మేధావులు అని అర్ధం ఉంది కనుక ఆ భావంతో అన్నారు అని పేర్కొన్నారు.

ఇక్కడ సమస్య మేధావులు అంటే ఎవరు. బ్రాహ్మలు కాని మేధావులను పండిట్ అని ఎందుకు పిలవటం లేదు? కశ్మీరీ బ్రాహ్మలకు ఉన్న మరోనామవాచకమే కశ్మీరీ పండిట్‌లు కదా! కులవ్యవస్థ ఉనికిలోకి వచ్చిన నాటి నుంచి బ్రాహ్మణులు తప్ప వేదాలు చదివిన వారు ఇతర కులాల్లో ఎవరూ లేరు. వేదాల్లో ఉన్నదే చెబుతున్నారా అసలు వాటిలో ఉన్నదేమిటి అని తెలుసుకొనే ఆసక్తి కలిగిన వేళ్ల మీద లెక్కించగలిగిన వారు తప్ప వేదాలను చదివే ఇతర కులస్థులు ఎంతు మంది ఉన్నారు? ఇటీవలి వరకు అసలు ఇతరులను చదవనివ్వలేదు. నిన్న మొన్నటి వరకు శూద్రులు, అంటరానివారుగా ముద్రవేసిన వారికి కనీస చదువు సంధ్యలు కూడా లేవు కదా.

అలాంటపుడు ఇతర కులాల్లోని ఏ పండితులు తమను తాము కించపరుచుకొనే విధంగా నిచ్చెనమెట్ల అంతరాలతో కులాలను సృష్టించినట్లు? చదువుకున్నది బ్రాహ్మల తరువాత క్షత్రియులు, వైశ్యులు మాత్రమే. అంటే ఈ కులాలకు చెందిన మేధావులు అనుకుంటే అందులో బ్రాహ్మల వాటా ఎంత? ఇతరుల వాటా ఎంతో ఆర్‌ఎస్‌ఎస్ నిపుణులు వేదగణితంతో గుణించి చెప్పాలి. కుల వ్యవస్థ పోవాలని ఇప్పటికైనా ఆర్‌ఎస్‌ఎస్ చెప్పటం, మారుమనస్సు పుచ్చుకోవటం మంచిదే. అందుకోసం వారు చేసిందేమిటి? మాటలకే పరిమితం, చిత్తశుద్ధి ఎక్కడా కనిపించదు. గమనించాల్సిందేమంటే కులాల సృష్టి పండితులదే అని చెప్పటంతో హిందూ, బ్రాహ్మణ వ్యతిరేకం అంటూ హిందూత్వ అనుకూలురు మోహన్ భగవత్ మీద మండిపడుతున్నారు. దక్షిణాదిలో మనువాదం, దానికి ప్రతినిధులుగా ఉన్న బ్రాహ్మణుల మీద ధ్వజమెత్తుతూ పెద్ద ఉద్యమం మాదిరి నడిచింది. బ్రాహ్మణులకు ప్రత్యామ్నాయంగా కొన్ని చోట్ల కమ్మబ్రాహ్మణులు వివాహతంతు వాటిని నిర్వహించిన రోజులు ఉన్నాయి. ఇటీవలి కాలంలో బ్రాహ్మణులు కాకున్నప్పటికీ బ్రాహ్మణవాదాన్ని తలకు ఎక్కించుకున్న అనేక మంది వర్ణ వ్యవస్థకు, హిందూత్వకు ముప్పు వచ్చిందంటూ వీధుల్లోకి వస్తున్నారు.

ఇప్పటికీ తంతుల పేరుతో బ్రాహ్మణులు జనాన్ని దోచుకుతింటున్నారని, పరాన్నభుక్కులుగా ఉన్నారంటూ వ్యతిరేకతను వెల్లడించటాన్ని చూడవచ్చు. ఉత్తరాదిలో బిజెపి మద్దతుదార్లుగా ఉన్న అనేక మంది దళితులు, వెనుకబడిన తరగతుల వారు తమ పట్ల వివక్షను ప్రదర్శించే మనుస్మృతి, పురాణాల గురించి ప్రశ్నిస్తున్నారు. ఒక ఒరలో రెండు కత్తులు ఇమడవు అన్నది తెలిసిందే. అందుకే ఓటు బాంకుగా ఉన్న బలహీన వర్గాలు లేవనెత్తే సామాజిక వివక్ష, కించపరచటాన్ని ప్రశ్నిస్తున్న కారణంగా అసలైన హిందూత్వ అంటే కులాలు లేనిది అనే పల్లవిని ఆర్‌ఎస్‌ఎస్ అందుకుంది. ఇప్పటి వరకు ప్రధాన మద్దతుదార్లుగా ఉన్న బ్రాహ్మ లు, బ్రాహ్మణవాదులు దాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకే ఒక విమర్శ చేసి దళిత, బహుజనులను, అబ్బే నా అర్ధం అది కాదు అంటూ బ్రాహ్మలను ఇతర అగ్రకులాలు అనుకొనే వారిని సంతుష్టీకరించేందుకు ఆర్‌ఎస్‌ఎస్ అధిపతి సాముగరిడీ చేస్తున్నారు. ఉత్తరాదిన బహుజనుల్లో ప్రారంభమైన ఈ ప్రశ్నించే, వివక్షను ఖండించేతత్వం మరింత పెరగటం అనివార్యం. అది హిందూత్వ అజెండాను, మనుకాలం నాటికి దేశాన్ని తీసుకుపోవాలనటాన్ని కూడా అంతిమంగా ప్రశ్నించకమానదు !

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News