న్యూఢిల్లీ: కరోనా కట్టడికి దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమలవుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోని మెడికల్ కళాశాలల్లో ప్రవేశం కోసం నిర్వహించే జాతీయ అర్హతా ప్రవేశ పరీక్ష(నీట్)ను వాయిదా వేస్తున్నట్లు కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. షెడ్యేల్ ప్రకారం ఈ నెల 27నుంచి ఈ పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్లను జారీ చేయాల్సి ఉంది. కరోనా కట్టడికి దేశం మొత్తం లాక్డౌన్ అమలవుతున్న కారణంగా మే 3న జరగాల్సిన నీట్ పరీక్ష వాయిదా పడింది. కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ ఈ విషయాన్ని ఒక ట్వీట్లో తొలియజేస్తూ, ఈ సమయాన్ని పరీక్ష ప్రిపరేషన్ కోసం ఉపయోగించుకోవాలని కోరారు. నీట్ పరీక్షకు మొత్తం 15,93,452 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఐఐటి, ఎన్ఐటిలలో ప్రవేశం కోసం ఏప్రిల్ 5 11తేదీల్లో నిర్వహించాల్సిన జెఇఇ మెయిన్ పరీక్షను కూడా కేంద్రం ఇప్పటికే వాయిదా వేసింది. దీంతో మే 17న నిర్వహించాల్సిన జెఇఇ అడ్వాన్స్డ్ పరీక్ష కూడా అనివార్యంగా వాయిదా వేసే సరిస్థితి ఏర్పడింది.