కరోనా నేపథ్యంలో పర్యటనను కెటిఆర్ వాయిదా వేశారు
ప్రభుత్వ చీఫ్విప్ దాస్యం వినయ్ భాస్కర్
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర పురపాలక, ఐటి మంత్రి, టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు వరంగల్ పర్యటన వాయిదాపడింది. కరోనా వైరస్ విజృంభన, వర్షాల నేపథ్యంలో కెటిఆర్ వరంగల్ పర్యటనను వాయిదా వేసినట్లు ప్రభుత్వ చీఫ్విప్ దాస్యం వినయభాస్కర్ తెలిపారు. బుధవారం ఉదయం 10. గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు వరంగల్ల్లో రూ.650 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు కెటిఆర్ చేయాల్సి ఉండగా ఈ కార్యక్రమాలు వాయిదా పడ్డాయి. అలాగే రాంపూర్ ఆక్సిజన్పార్క్, ఖాజీపేటలోని కడిపికొండ జంక్షన్ వద్ద మడికొండ వాసులకు చెందిన 200 డబుల్ బెడ్రూం ఇళ్లు, ఖాజీపేటలో స్థానికుల కోసం నిర్మించబోయే 97 డబుల్ బెడ్రూం ఇళ్ల శంకు స్థాపనలు కెటిఆర్ చేయాల్సి ఉంది.
అలాగే అనేక పనులను ప్రారంభించాల్సి ఉండగా కరోనా విపత్కర పరిస్థితుల్లో మంత్రి తన పర్యటనను వాయిదా వేసినట్లు దాస్యం వినయ్ భాస్కర్ తెలిపారు. త్వరలో కెటిఆర్ పర్యటన ఖరారు కానుందని ఆయన చెప్పారు. ప్రస్తుత అభివృద్ధి పనులతో పాటు మరికొన్ని అభివృద్ధి పనులకు త్వరలో కెటిఆర్ ప్రారంభోత్సవాలు చేయనున్నారని ఆయన తెలిపారు. కరోనా నేపథ్యంలో ప్రజలకు,అధికారులకు ఇబ్బందులు కలగకుండా ప్రస్తుతం కెటిఆర్ పర్యటన వాయిదాపడిందని ఆయన వివరించారు.