మిర్యాలగూడ : ప్రణయ్ హత్య కేసు విచారణ ఈ నెల 23కు వాయిదా పడింది. కేసును వాయిదా వేస్తూ నల్గొండలోని ఎస్సి, ఎస్టీ అత్యాచారాల నిరోధక కోర్టు నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన ఎ1 మారుతీరావు ఆత్మహత్యకు పాల్పడిన విషయాన్ని ప్రాసిక్యూషన్ తరపు న్యాయవాది న్యాయస్థానానికి తెలియజేశారు. సోదరుడి చితికి నిప్పటించినందున హిందూ సంప్రదాయం ప్రకారం బయటకు వచ్చే అవకాశం లేదు కాబట్టి మారుతీరావు తమ్ముడు శ్రవణ్ విచారణకు హాజరయ్యే అవకాశం లేదని తెలిపారు. శ్రవణ్కు మినహాయింపునివ్వాలని ఆయన తరపు న్యాయవాది కోర్టును అభ్యర్థించారు. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సీఆర్పీసీ 317 సెక్షన్ ప్రకారం.. శ్రవణ్కు ఈ విడతకు కోర్టు హాజరు నుంచి ఉపశమనం లభించింది. వీటన్నింటి దృష్టా న్యాయస్థానం కేసును ఈ నెల 23కు వాయిదా వేసింది.
2018 సెప్టెంబర్ 14న ప్రణయ్ హత్య…
2018 సెప్టెంబర్ 14న ప్రణయ్ మెడికల్ చెకప్ కోసం అమృతను హాస్పిటల్కు తీసుకెళ్లి ఇంటికి బయల్దేరుతుండగా ఆసుపత్రి గేటు దాటక ముందే కిరాయి హంతక ముఠా అతడ్ని నరికి హత్య చేశారు. ఈ కేసులో అమృత తండ్రి మారుతీరావుతో పాటు ఆయన సోదరుడు శ్రవణ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆరు నెలల కిందట వీరిద్దరూ బెయిల్పై విడుదలయ్యారు. అయితే గత విచారణ సందర్భంగా తమ న్యాయవాదులను మార్చుకోవడానికి మారుతీరావు అనుమతి కోరారు. దీంతో ఈ విషయంలో న్యాయస్థానం అనుమతి ఇచ్చింది. అయితే కారణం ఏమిటో కానీ మారు తీరావు మూడు రోజుల క్రితం ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
చార్జిషీట్లో పోలీసులు సంచలన విషయాల వెల్లడి….
ప్రణయ్ హత్య కేసులో దర్యాప్తు చేసిన పోలీసులు 1200 పేజీల ఛార్జిషీట్ దాఖలు చేశారు. ఈ కేసులో మొత్తం 102 మంది సాక్షులను విచారించారు. ప్రణయ్, అమృతల పరిచయం, ప్రేమ మొదలు.. ఈ కేసుకు సంబంధించిన అన్ని విషయాలు చార్జిషీట్లో పోలీసులు పేర్కొన్నారు. మారుతీరావు, అతడి తమ్ముడు శ్రవణ్, అమృత, ప్రణయ్ తండ్రి బాలస్వామిలు ఇచ్చిన స్టేట్మెంట్లను కూడా చార్జిషీటల్లో పొందుపర్చారు. ఈ చార్జిషీట్ గురించే మారుతీరావు భయపడ్డారని అంటున్నారు.