నొయిడా (యుపి) : ప్రసవించే సౌకర్యం కోసం 13 గంటల పాటు ఆస్పత్రులను వెతుకుతూ అంబులెన్సులోనే నిండు గర్భిణి ప్రాణాలు కోల్పోయింది. ఆ నిండుగర్భిణి నీలం (30), ఆమె భర్త విజేందర్ సింగ్ (30) ప్రభుత్వ ఆస్పత్రితోసహా ఎనిమిది ఆస్పత్రుల తలుపులు తట్టినా వారి మొర ఎవరూ పట్టించుకోలేదు. ఏ ఆస్పత్రి ఆమె ప్రసవానికి వీలు కల్పించక పోవడంతో ఆమె అంబులెన్సులోనే కన్ను మూసింది. ఈ సంఘటనపై గౌతమ్ బుధ్ నగర్ జిల్లా అధికార యంత్రాంగం దర్యాప్తునకు ఆదేశించింది. నొయిడాఘజియాబాద్ సరిహద్దులో ఖోడా కాలనీ నివాసి నీలం ఎనిమిది నెలల గర్భిణి. నొయిడాలో శివాలిక్ ప్రైవేట్ ఆస్పత్రిలో గర్భిణికి సంబంధించిన సమస్యలపై వైద్యచికిత్స చేయించుకుంది. అయితే శుక్రవారం ఆమెను చేర్చుకోడానికి ఆస్పత్రి నిరాకరించడంతో వారు ఆస్పత్రులను వెతకడం మొదలు పెట్టారు. ఈ విధంగా ఎనిమిది ఆస్పత్రులను ఆశ్రయించినా వారు నిరాకరించడంతో ఫలితం లేక పోయింది. చివరకు ఆమె అంబులెన్సు లోనే చనిపోయిందని మృతురాలు భర్త ఆరోపించారు.