న్యూఢిల్లీ: అత్యంత వివాదాస్పదం, తీవ్రస్థాయి ప్రతిపక్ష వ్యతిరేకతల నడుమనే మూడు వ్యవసాయ బిల్లుకు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆమోదం తెలిపారు. ఇటీవలే ముగిసిన పార్లమెంట్ వర్షాకాల సమావేశాలలో ఈ వ్యవసాయ బిల్లులకు ఆమోదం దక్కింది. ఈ బిల్లులు ఏకపక్షంగా ఉన్నాయని, వీటిపై ఆమోదం తెలియచేయరాదని 18 ప్రతిపక్షాలు ఇటీవలే రాష్ట్రపతి కోవింద్కు లేఖ రాశాయి. అయితే రాష్ట్రపతి ఆమోద ముద్ర ఈ బిల్లులకు దక్కిందనే విషయాన్ని ఆదివారం వెలువరించిన అధికారిక గెజిట్ నోటిఫికేషన్లో తెలిపారు. ఈ వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా పలు చోట్ల నిరసనలు వ్యక్తం అయ్యాయి. ప్రత్యేకించి పంజాబ్, హర్యానాలలో రైతాంగం ఉద్యమానికి దిగింది. పలు చోట్ల రైలు పట్టాలపై రైతులు భైఠాయించారు. అయితే రైతుల ఉత్పత్తుల వ్యాపార, వాణిజ్య (ప్రోత్సాహక, సానుకూలత) బిల్లు, 2020ను, రైతాంగపు (సాధికారత, రక్షణ) పంటకు సరైన ధరల భరోసా, సాగు సేవల బిల్లు 2020ను, నిత్యావసర సరుకుల(సవరణలు) 2020 బిల్లును రాష్ట్రపతి ఆమోదించి నట్లు గెజిట్లో తెలిపారు.
దీనితో ఇవి ఇప్పుడు చట్టాలుగా మారేందుకు అర్హత పొందాయి. వివిధ రాష్ట్రాల చట్టాల ద్వారా ఏర్పాటు అయిన అధీకృత వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ కమిటీలు (ఎపిఎంసి) నియంత్రించే మండీలకు అతీతంగా వేరేచోట రైతులు తమ పంటలను విక్రయించుకునేందుకు బిల్లులతో వీలేర్పడుతుంది. మరో బిల్లుతో రైతులు కాంట్రాక్ట్ సాగు ఒప్పందాలకు దిగేందుకు రంగం సిద్ధం అవుతుంది. నిత్యావసర సరుకుల చట్టం ద్వారా ఉత్పత్తుల విక్రయాలపై ఆంక్షల ఎత్తివేతకు వీలుంటుంది. పప్పులు, తృణధాన్యాలు బంగాళాదుంపలు, ఉల్లిగడ్డలు,వంటనూనెల గింజల సరఫరా పంపిణీలకు వీలేర్పడుతుంది. ఇంతకు ముందటి ప్రతిబంధకాలు వీడుతాయని ప్రభుత్వం చెపుతోంది. అయితే ఇప్పటి బిల్లులతో ఏకంగా ప్రభుత్వం చివరికి వ్యవసాయ రంగాన్ని కూడా కార్పొరేట్లకు తాకట్టు పెట్టిందని, కేవలం సభలలో తమ సంఖ్యాబలం చూసుకుని, తప్పుడు పద్ధతులతో బిల్లులను ఓటింగ్ లేకుండా మూజువాణితో ఆమోదింపచేసుకుందని ప్రతిపక్షాలు నిరసిస్తూ వస్తున్నాయి. పార్లమెంట్లో ప్రజాస్వామ్య ఖూనీ జరిగిన చందంగా ఈ బిల్లుల ఆమోదానికి ప్రభుత్వం దూకుడుగా వ్యవహరించిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తమ నిరసన వ్యక్తం చేశారు. అయితే బహుముఖ వ్యతిరేకతలను, ప్రతిపక్షాలు పంపించిన ఉమ్మడి లేఖ నేపథ్యంలోనే రాష్ట్రపతి ఈ బిల్లులకు ఆమోద ముద్రవేశారు. బిల్లులు రైతాంగ వ్యతిరేకమని పేర్కొంటూ కేంద్రంలోని అధికారపు ఎన్డిఎలో ఉన్న చిరకాలపు మిత్రపక్షం శిరోమణి అకాలీదళ్ ఎన్డిఎ నుంచి వైదొలిగింది. ఈ పార్టీకి చెందిన మంత్రి పదవికి రాజీనామా చేశారు. దీనితో రాజకీయ ప్రకంపనలు తీవ్రతరం అయ్యాయి.
President Ramnath Kovind Nath Approval to 3 Farm Bill