మనతెలంగాణ/హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా సీతానగరం శిరోముండనం కేసుపై రాష్ట్రపతి కార్యాలయం బుధవారం స్పందించింది. ఈ కేసును రాష్ట్రపతి కార్యాలయం తీవ్రంగా పరిగణించింది. తనకు జరిగిన అన్యాయంపై ఇటీవలే బాధితుడు ప్రసాద్ రాష్ట్రపతికి లేఖ రాయడంతో బాధ్యులపై సత్వర చర్యలు తీసుకోవాలని ఎపి ప్రభుత్వానికి రాష్ట్రపతి కార్యాలయం ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకున్నట్టు రాష్ట్రపతి కార్యాలయానికి ఎపి ప్రభుత్వం సమాధానం పంపింది. ఎపికి చెందిన సాధారణ పరిపాలన విభాగానికి సంబంధిత దస్త్రం బదిలీ చేసింది. అసిస్టెంట్ సెక్రటరీ జనార్దన్బాబును కలవాలని బాధితుడు ప్రసాద్కు ఆదేశం పంపింది. ఈ కేసు విషయంలో జనార్దన్బాబుకు సహకరించాలని ప్రసాద్కు సూచించింది.
తూర్పుగోదావరి జిల్లా సీతానగరంలో స్థానిక వైకాపా నాయకుడి అనుచరుడి ఫిర్యాదు మేరకు ఇటీవల వెదుళపల్లిలో వరప్రసాద్ అనే ఎస్సి యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. తీవ్రంగా గాయపర్చడంతోపాటు పోలీస్స్టేషన్లోనే అతడికి శిరోముండనం చేశారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అనంతరం ఈ ఘటనతో మనస్తాపం చెందిన వరప్రసాద్ తాను నక్సలైట్లలో కలుస్తానంటూ ఇటీవల రాష్ట్రపతికి లేఖ రాశారు. వరప్రసాద్ లేఖపై రాష్ట్రపతి స్పందించి చర్యలు తీసుకున్నారు.
President respond on AP dalit man head tonsured case