జార్జ్ రెడ్డి, ప్రెజర్ కుక్కర్ లాంటి సినిమాలతో విమర్శకుల ప్రశంసలు అందుకొని తన మూడవ చిత్రాన్ని రూపొందిస్తున్నారు నిర్మాత అప్పి రెడ్డి. బిగ్ బాస్ సీజన్ 4తో ఆకట్టుకున్న సయ్యద్ సోహైల్, నూతన దర్శకుడు శ్రీనివాస్ వింజనంపాటి కలయికలో ఈ చిత్రం తెరకెక్కనుంది. ఈ చిత్ర విశేషాలను తెలియజేయడానికి చిత్ర యూనిట్ గురువారం హైదరాబాద్లోని ఫిలింఛాంబర్లో పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా నిర్మాత అప్పిరెడ్డి మాట్లాడుతూ “మా మూడవ సినిమాను కొత్త డైరెక్టర్ శ్రీనివాస్, బిగ్ బాస్ ఫేం సోహైల్తో చేయడం గర్వంగా ఉంది.
మా మైక్ మూవీ ఎప్పుడూ కొత్త టాలెంట్ను ప్రోత్సహిస్తుంది. ఒక కొత్త కాన్సెప్ట్తో ఈ మూవీ రానుంది”అని అన్నారు. సయ్యద్ సోహైల్ మాట్లాడుతూ “బిగ్ బాస్ నుంచి బయటకు రాగానే నేను ఎలాంటి మూవీ చేస్తానని అందరూ ఎదురుచూస్తున్నారు. నిజంగానే ఈ సినిమా కథ వేరేగా ఉంటుంది”అని చెప్పారు. దర్శకుడు శ్రీనివాస్ వింజనం పాటి మాట్లాడుతూ “కొత్త కాన్సెప్ట్ తో ఈ మూవీ చేస్తున్నాము. నేను, సోహైల్ ఏడు సంవత్సరాల నుంచి క్లోజ్ ఫ్రెండ్స్. ఈ సినిమా ద్వారా మా కల నెరవేరుతున్నందుకు సంతోషంగా ఉంది”అని పేర్కొన్నారు.