సీరం సంస్థ నిర్ణయించే అవకాశం
న్యూఢిల్లీ : కరోనా వ్యాక్సిన్ తయారీ సంస్థ సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా తమ టీకా డోసు ధరను రూ.250 గా నిర్ణయించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈమేరకు టీకా సరఫరా ఒప్పందంపై సంతకాలు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు ఓ మీడియా సంస్థ మంగళవారం నివేదించింది. వ్యాక్సిన్ల అత్యవసర వినియోగానికి అనుమతి ఇవ్వాలంటూ సీరం, ఫైజర్, భారత్ బయోటెక్ సంస్థలు ఇప్పటికే దరఖాస్తులు చేసుకున్నాయి. దీనిపై రెండు వారాల్లో నిర్ణయాలు జరగవచ్చు. ఈ సందర్భంగా వ్యాక్సిన్ల ధరలపై వార్తలు వస్తున్నాయి. సీరం సంస్థ భారీగా టీకాలు సరఫరా చేస్తుందన్న నమ్మకంతో కేంద్ర ప్రభుత్వం ఉంది. భారత్ లోని ప్రైవేట్ మార్కెట్లో ఒక్కో డోసు ధర రూ. 1000 వరకు ఉండవచ్చని భారీ సరఫరా ఒప్పందాలపై సంతకాలు చేసిన ప్రభుత్వాలకు అంతకన్నా తక్కువ ధరకే డోసులు లభించవచ్చని సీరం సీఐఒ అదర్పూనావాలా ఇటీవల వెల్లడించారు.