న్యూజిలాండ్ ఎన్నికల్లో ప్రధాని ఘన విజయం
80 ఏళ్ల దేశ చరిత్రలో ఎన్నడూ లేనంత మెజారిటీ
కరోనా కట్టడిలో కృషి, సమర్థ పాలనకు దక్కిన గెలుపు
రాబోయే మూడేళ్లలో చేయాల్సింది ఎంతో ఉందని పేర్కొన్న ఆర్నెర్డ్
ఆక్లాండ్: న్యూజిలాండ్ ప్రధానమంత్రి జసిండా ఆర్డెర్న్(40)మరోసారి విజయపతాకాన్ని ఎగరేశారు. న్యూజిలాండ్ సార్వత్రిక ఎన్నికల్లో ఆమె ఘన విజయం సాధించారు. కరోనాను విజయవంతంగా అరికట్టడంలో ఆమె చేసిన కృషి. సమర్థవంతమైన పాలన ఆమెకు ఘనవిజయాన్ని సాధించి పెట్టాయి. పోలయిన ఓట్లలో దాదాపు చాలావరకు లెక్కపెట్టే సమయానికి ఆర్డెర్న్ లేబర్ పార్టీ 49 శాతం ఓటు షేరుతో ఘన విజయం సాధించగా ప్రధాన ప్రతిపక్షమైన కన్సర్వేటివ్ నేషనల్ పార్టీకి కేవలం 27 శాతం ఓట్లు లభించాయి.1930 తర్వాత న్యూజిలాండ్ ఎన్నికల్లో ఒక పార్టీకి ఇంత భారీ విజయం లభించడం ఇదే మొదటి సారి. క్రితం సారి ఎన్నికల్లో ఆర్డెర్న్ పార్టీకి పూర్తి మెజారిటీ లభించక పోవడంతో ఇతర పార్టీలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి వచ్చింది. అయితే ఈ సారి ఆ అవసరం ఉండకపోవచ్చని భావిస్తున్నారు.
విజయం అనంతరం ఆక్లాండ్లో వందలాది మద్దతుదారులనుద్దేశించి జసిండా మాట్లాడుతూ, రాబోయే మూడేళ్లలో తాను చేయాల్సిన పని చాలా ఉందన్నారు. కరోనా మహమ్మారితో దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దడం, సామాజిక అసమానతల పరిష్కారం తనముందున్న పెద్ద సవాళ్లని వ్యాఖ్యానించారు. అయితే కరోనా సంక్షోభంనుంచి చాలా త్వరగా బైటపడతామన్న ధీమాను వ్యక్తం చేశారు. కొవిడ్19 కట్టడిలో తమ ప్రభుత్వానికి ప్రజాభిప్రాయం లాంటిదని లేబర్ పార్టీ విజయంపై ఆర్థిక మంత్రి గ్రాంట్ రాబర్ట్సన్ సంతోషం వ్యక్తం చేశారు. న్యూజిలాండ్ ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. జసిండా ప్రజాదరణ, మానియాకు ఇది నిదర్శనమని పొలిటికల్ వెబ్సైట్ డెమోక్రటిక్ ప్రాజెక్ట్ వ్యాఖ్యాత జెఫ్రీమిల్లెర్ అభివర్ణించారు. ఆమె సూపర్స్టార్ బ్రాండ్కు లభించిన వ్యక్తిగత విజయమని వ్యాఖ్యానించారు. షెడ్యూల్ ప్రకారం సెప్టెంబర్19న న్యూజిలాండ్లలో ఎన్నికలు జరగాలి. అయితే కరోనా మహమ్మారి రెండోసారి విజృంభించడంతో ఎన్నికలు అక్టోబర్ 17కు వాయిదా పడ్డాయి.