అమెరికా పర్యటనకు ప్రధాని మోడీ
న్యూఢిల్లీ : క్వాడ్, ఐరాస సదస్సులలో పాల్గొనేందుకు భారత ప్రధాని నరేంద్ర మోడీ బుధవారం ఇక్కడి నుంచి అమెరికాకు బయలుదేరి వెళ్లారు. అమెరికాలో తమ ఇప్పటి పర్యటన అత్యంత కీలకమైనదని పర్యటనకు ముందు వెలువరించిన ప్రకటనలో మోడీ తెలిపారు. ఇండో యుఎస్ సమగ్ర ప్రపంచ స్థాయి బంధం బలోపేతం, ఇదే దశలో జపాన్, ఆస్ట్రేలియాలతో కీలక విషయాలలో సారూప్యత ఇనుమడింపచేసుకోవడం జరుగుతుందని ప్రధాని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ అమెరికా పర్యటన సందర్భంగా ప్రధాని మోడీ అమెరికా అధ్యక్షులు జో బైడెన్తో నేరుగా సవివర చర్చలు జరుపుతారు. అమెరికాకు చెందిన పలువురు పారిశ్రామికవేత్తలు, ఐటి దిగ్గజాలతో ఇష్టాగోష్టి సమావేశం నిర్వహిస్తారు. ఐరాస సర్వసభ్య సమావేశంలో తమ ప్రసంగం ఉంటుందని, ఇక్కడ ఐరాస వేదికపై అత్యంత కీలకమైన విషయాలు ప్రస్తావనకు వస్తాయని ప్రధాని తెలిపారు.
కోవిడ్, ఉగ్రవాద నిర్మూలన, వాతావరణ మార్పులు వంటివి అజెండాలోని ముఖ్యాంశాలు అని , ఇటీవలి కాలంలో ప్రపంచ స్థాయి నేతల ప్రత్యక్ష భేటీ జరగడం ఇదే తొలిసారి అని ప్రధాని తెలిపారు. తాను ఢిల్లీ నుంచి విమానం ఎక్కుతుండగా తీసిన ఫోటోలతో ప్రధాని కార్యాలయం ట్వీటు వెలువరించింది. అమెరికా దేశాధ్యక్షులు గౌరవనీయ జో బైడెన్ ఆహ్వానం మేరకు తాను ఈ నెల 22 నుంచి 25 వరకూ మూడు రోజులు అమెరికాలో పర్యటిస్తున్నానని ప్రధాని తెలిపారు. అక్కడ దేశ ఉపాధ్యక్షురాలు , భారతీయ సంతతికి చెందిన కమలా హారిస్తో కూడా ప్రధాని సమావేశం కానున్నారు. క్వాడ్ సదస్సు సందర్భంగా అమెరికా, జపాన్, ఇండియా, ఆస్ట్రేలియాల నేతల కీలక సదస్సు జరుగుతుందని ఇందులో పలు అంతర్జాతీయ , ప్రాంతీయ స్థాయి అంశాలు ప్రస్తావనకు వస్తాయని ప్రధాని పేర్కొన్నారు. బైడెన్, ప్రధాని మోడీ, ఆస్ట్రేలియా జపాన్ల ప్రధానులు స్కాట్ మోరిసన్, యోషిడో సుగా భేటీతో జరిగే క్వాడ్సదస్సుపై అంతర్జాతీయ ఆసక్తి నెలకొంది.
కోవిడ్పై గ్లోబల్ సమ్మిట్: బైడెన్ చొరవ తీసుకుని ఏర్పాటు చేస్తున్న అంతర్జాతీయ స్థాయి కోవిడ్ కీలక సదస్సులో ప్రధాని మోడీ పాల్గొంటారు. ప్రపంచ దేశాలలో కరోనా వైరస్ పరిస్థితి, వివిధ దేశాలలో వ్యాక్సిన్ల లభ్యత వంటి అంశాలు ప్రస్తావనకు వస్తాయి.
24న ఐరాస సభలో మోడీ ప్రసంగం
ఐక్యరాజ్య సమితి 76వ సర్వసభ్య సమావేశం నేపథ్యంలో ఈ నెల 24వ తేదీన శుక్రవారం ప్రధాని మోడీ ప్రసంగిస్తారు. వాషింగ్టన్ నుంచి న్యూయార్క్కు బయలుదేరి వెళ్లి, అత్యంత కీలకమైన వార్షిక సభలో ప్రస్తుత ప్రపంచ సమస్యలపై మాట్లాడుతారు.