Thursday, March 28, 2024

అసంఘటిత రంగానికి ముప్పు!

- Advertisement -
- Advertisement -

Unorganised-sector

కేంద్రంలో అధికారంలో నరేంద్రమోడీ ప్రభుత్వం ఉంది. 2014లో ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అప్పటి నుంచి అసంఘటితరంగం లేదా ఇన్ ఫార్మల్ ఎకానమీని నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు కనబడుతోంది. ప్రస్తుతం భారత జిడిపిలో అసంఘటిత రంగం యాభై శాతం ఉంది. క్రమంగా మరింత తగ్గిపోతోంది. కాని భారతదేశంలోని కార్మికశక్తిలో 80 నుంచి 90 శాతం అసంఘటిత రంగంలోనే పనిచేస్తున్నారు.

వ్యవసాయరంగం కూడా ఇందులో ఉంది. భూయాజమాన్యం రిజీస్ట్రేషను జరిగినా కూడా, పెద్ద సంఖ్యలో వ్యవసాయరంగంలో కూలీలు పనిచేస్తున్నప్పటికీ ఇది అసంఘటితరంగంలోనే ఉంది. కేవలం ప్లాంటేషన్స్ మాత్రము ఆర్గనైజెడ్ గా పరిగణించబడుతున్నాయి. అసంఘటితరంగంలో చాలా ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లోని లాంఛనేతర ఆర్దికకార్యకలాపాలన్నీ అసంఘటిత రంగమే. సర్వీసు సెక్టారులో కూడా చాలా వరకు అసంఘటిత రంగమే. మాన్యుఫాక్చరింగ్ రంగలోను, వర్క్ షాప్ పరిశ్రమల్లోను, వ్యాపారవాణిజ్యాల్లోను అసంఘటిత కార్మికులు పెద్ద సంఖ్యలో ఉన్నారు.

మనకు సమగ్రమైన డేటా లేదు. సర్వేలు, వివిధ కేసుల అధ్యయనాలపై ఆధారపడి లెక్కలు వేయవలసి ఉంది. కాని అసంఘటితరంగం దేశంలో చాలా పెద్దది అనే విషయమై ఎవరికీ అనుమానాలు లేవు. ఆర్ధికప్రగతికి, ఉపాధి అవకాశాలకు ఈ అసంఘటితరంగమే ఉపయోగపడుతుంది. కార్మికశక్తి అధికంగా అవసరమైన ఎగుమతులకు అసంఘటితరంగమే తోడ్పాటు అందిస్తోంది. అత్యంత అవసరమైన వస్తుసేవలను అసంఘటిత రంగమే అందజేసింది. కోవిద్ 19 సందర్భంగా ఈ వాస్తవం మరింత స్పష్టంగా అర్థమైంది. భారత ఆర్ధికవ్యవస్థ దీనిపైనే చాలా వరకు ఆధారపడి ఉంది. అసంఘటితరంగమన్న పేరే కాని అసంఘటితంగా ఏమీ లేదు. వాణిజ్యసంఘాలు, యూనియన్లు, కులసంఘాలు, మతసంఘాలు ఇలా ఏదో ఒక రూపంలో సంఘటితమవుతూనే ఉన్నారు. ఈవివిధ గుర్తింపులు క్రమేణా తొలగిపోతాయని మన రాజ్యాంగ నిర్మాతలు భావించారు. కాని ఇవి నానాటికి మరింత బలపడ్డాయి.

అసంఘటితరంగమంటే ఇప్పుడు కేవలం కుటీర పరిశ్రమలు, చిన్నస్థాయి పరిశ్రమలు, రిజీస్ట్రేషన్ లేని పరిశ్రమలు, అందులో పనిచేస్తున్న కార్మికులు మాత్రమే కాదు. నిజానికి భారతదేశంలోని 95 శాతం కంపెనీల్లో 5 గురి కన్నా తక్కువ మంది మాత్రమే జీతభత్యాలు తీసుకుంటున్న ఉద్యోగులున్నారు. ఇటీవల జరిగిన ఒక సర్వే ప్రకారం ఇద్దరి కన్నా ఎక్కువ లేరని కూడా తెలుస్తోంది. ఇక్కడే పేదరికం రాజ్యం చేస్తోంది. ఇక్కడే సంపద కూడా పోగుపడుతోంది. ప్రస్తుతం చాలా కంపెనీలు చట్టాల విషయంలో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. అంటే సాధ్యమైన మేరకు అసంఘటిత రంగంగా గుర్తింపు పొందుతున్నారు. కేవలం ఒక లైసెన్సు, ఒక బ్యాంకు ఎక్కౌంటు ఉంటే చాలు.

పర్యావరణానికి సంబంధించిన చట్టాలు, భవన నిర్మాణానికి సంబంధించిన చట్టాలు, పని పరిస్థితులకు సంబంధించి నియమనిబంధనలు అన్నింటిలోను సడలింపులు లభిస్తాయి. స్థానిక పన్నులు చెల్లిస్తే చాలు, ఆదాయపు పన్ను, బిజినెస్ టాక్సు కట్టవలసిన అవసరం లేదు. చాలా సంవత్సరాలుగా భారతదేశంలో కార్పోరేట్ సంస్థలు చేస్తున్న పని ఏమిటంటే, కార్మికులకు సంబంధించిన ఖర్చులు, రిస్కులు అన్నీ ప్రయివేటు సబ్ కాంట్రాక్టర్లపై వేయడం ద్వారా తప్పించుకుంటున్నారు. ఈ ప్రయివేటు సబ్ కాంట్రాక్టర్లు వర్కర్లతో నోటిమాటగా మాత్రమే ఒప్పందాలు చేసుకుంటారు. కాగితాలపై రాసుకున్నా, ఆ ఒప్పందాలన్నీ యజమానికి అనుకూలంగాను, కార్మికులకు వ్యతిరేకంగాను ఉంటాయి. కేజువల్ లేబర్ గా పనిచేస్తున్న వారికి మరో మార్గం కూడా ఉండదు. చేస్తే ఈ పని చేయాలి లేదా పస్తులు ఉండాలి.

ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ అసంఘటిత రంగం కార్పోరేట్ రంగానికి తీవ్రమైన పోటీ ఇస్తుంది. భారతదేశంలో అసంఘటిత రంగం అనేది ఉండరాదని మేనేజిమెంట్ నిపుణులు భావిస్తారు. ఎన్డీయే ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాతి నుంచి అసంఘటితరంగంపై వరుస దాడులు జరుగుతున్నాయి. 2014 ఎన్నికల్లో గెలుపు తర్వాత మొదటి బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు అసంఘటితరంగంపై ఒక నివేదిక సమర్పిస్తామన్నారు. ఆ మాట ఇంతవరకు నిలబెట్టుకోలేదు. 2016, నవంబర్ 8వ తేదీన అకస్మాత్తుగా నోట్లరద్దు చేశారు. అవినీతిని అంతం చేయడానికి, నల్లడబ్బును పట్టుకోడానికి, దొంగనోట్లను దెబ్బతీయడానికి, నగదురహిత లావాదేవీలు పెంచడానికి ఇలా నోట్లరద్దు విషయంలో అనేక లక్ష్యాలు చెప్పారు. ఒక్కటి కూడా సాధించలేదు. కాని, అసంఘటితరంగాన్ని నోట్లరద్దు దుంపనాశనం చేసింది.

నోట్లరద్దు ప్రకటించిన లక్ష్యాల్లో ఈ మాట లేదు. దేశంలో నగదురహిత లావాదేవీలు పెంచేస్తామని, దానివల్ల పన్ను వసూళ్ళు పెరిగిపోతయని చెప్పారు. కాని నోట్లరద్దుకు ముందు దేశంలో 98 శాతం లావాదేవీలు నగదు రూపంలోనే జరిగేవి. నోట్లరద్దు వల్ల నగదు మార్కెట్ నుంచి మాయమైపోయింది. ఫలితంగా అసంఘటితరంగం ఊహించని కుదుపులకు గురైంది. క్యాష్ లెస్ లావాదేవీలు తెలియకపోవడం వల్ల, డిజిటల్ లావాదేవీలకు కమీషన్ చెల్లించడం ఇష్టం లేనందువల్ల, మొబైల్ బ్యాంకు సేవలపై నమ్మకం లేనందువల్ల డిజిటల్ లావాదేవీల వైపు ప్రజలు మొగ్గు చూపలేదు. అందుకు బదులుగా బార్టర్ లావాదేవీలు ప్రారంభమయ్యాయి. దీర్ఘకాలిక రుణాలు కూడా ముందుకు వచ్చాయి. నోట్లరద్దు అసంఘటితరంగాన్ని చావుదెబ్బ తీసింది.
ఆ తర్వాత జియస్టీ వచ్చింది.

జులై 2017లో వచ్చిన జియస్టీ వల్ల అసంఘటితరంగంలో 35 నుంచి 45 శాతం వరకు ఉద్యోగాలు పోయాయని వార్తలు వచ్చాయి. జియస్టీ తర్వాత కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ విధించారు. ప్రజారోగ్యం కోసం ప్రపంచవ్యాప్తంగా తీసుకున్న నిర్ణయమిది. ఏదేశంలోను లేనంత కఠినంగా లాక్ డౌన్ భారతదేశంలో అమలు చేశారు. కాని లాక్ డౌన్ వల్ల కాజువల్ లేబర్, వలసకూలీల బతుకులు దుర్భరమయ్యాయి. చేయడానికి పనిలేదు, చేతిలో డబ్బులేదు. అందువల్ల వేలాది మం ది వలసకూలీలు తమ స్వంత ఊళ్ళకు ప్రయాణమయ్యారు. ఈ వలసకూలీలను వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు ఫ్యాక్టరీ కాంపౌండుల్లో, ఇతర చోట్ల నిర్బంధించి క్వారంటైన్ చేస్తున్నారు. వారికి ఆహారం, తాగునీరు కనీస సదుపాయాలు లభించడం లేదు. దాదాపు 2 కోట్ల మంది వలసకూలీలు ఉన్నారని అంచనా. పోలీసులు దౌర్జన్యాలు, ఆకలిదప్పులతో ఈ వలసకూలీలు అలమటిస్తున్నారు.

వలసకూలీలు ఉద్యోగాలు కోల్పోయి స్వంత ఊళ్ళకు వెళుతున్నారు. కాని లాక్ డౌన్ వల్ల ఉపాధి కోల్పోయిన అనేకమంది స్థానికులున్నారు. చిన్న చిన్న కుటుంబ వ్యాపారాలు, చిన్న చిన్న దుకాణాలు, తోపుడు బండ్ల వర్తకులు ఉపాధి కోల్పోయారు. దేశవ్యాప్తంగా దాదాపు 35 కోట్ల మంది ఇలా ఉపాధి కోల్పోయారని అంచనా. ఈ కుటుంబాలు ఆకలిబాధలకు గురవుతున్నాయి. స్వచ్ఛందసంస్థలు, ప్రభుత్వాలు ఆదుకోవలసిన పరిస్థితి ఉంది. ప్రభుత్వం ప్రజాపంపిణీ ద్వారా ఆదుకోవాలి. కాని దాదాపు 8 కోట్ల పేద కుటుంబాలకు రేషను కార్డులు లేవని తెలుస్తోంది. ప్రభుత్వం ప్రకటించిన స్కీముల ప్రయోజనాలు వారికి అందడం లేదు. జన్ ధన్ యోజనలో ఖాతాలున్నవారికి మాత్రమే అది కూడా కేంద్రం నెలకు 500 రూపాయలు మాత్రమే ఇస్తోంది. ఈ సొమ్ము కూడా వారి చేతికి అందడం లేదు. వేలిముద్రల సమస్య వల్ల పేమెంట్లు జరగడం లేదని తెలుస్తోంది.

ఎన్డీయే అధికారంలోకి వచ్చిన తర్వాత వరుసగా అసంఘటితరంగం ఎదుర్కున్న కుదుపులివి. ఇవన్నీ యాధృచ్ఛికం కాదు. ఉద్దేశ్యపూర్వకగా అసంఘటితరంగం పట్ల నిర్లక్ష్యం వహించారని చాలా మంది విశ్లేషిస్తున్నారు. అసంఘటితరంగం, స్వయం ఉపాధి, చిన్న వ్యాపారాలను ప్రోత్సహించడం ద్వారా ఆర్దికవ్యవస్థలో వాటి ప్రాముఖ్యాన్ని గుర్తించడం లేదు. అవసరమైన సమయంలో సహాయసహకారాలు అందించడం కూడా జరగడం లేదు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News