భారత్ నుంచి పూర్తిగా కనుమరుగు
న్యూఢిల్లీ: దేశంలో పబ్జీ ఆటకు తెరపడింది. పబ్జీగా పేరుపొందిన ప్లేయర్ అన్నోన్స్ బ్యాటిల్ గ్రౌండ్ మొబైల్ గేమ్ భారతదేశంలో శుక్రవారం నుంచి అదుబాటులోకి రాదని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. పబ్జీ మొబైల్, దాని మరో వెర్షన్ పబ్జీ లైట్తో సహా 118 చైనీస్ యాప్లను భారత ప్రభుత్వం నిషేధించిన రెండు నెలల తర్వాత పబ్జీ దేశం నుంచి పూర్తిగా కనుమరుగైంది. భారతదేశ సౌరభౌమత్వానికి, సమగ్రతకు, రక్షణకు, దేశ, ప్రజల భద్రతకు ముప్పుగా పనిణమించిన చైనీస్ యాప్లను నిషేధిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం రెండు నెలల క్రితం ప్రకటించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి గూగుల్ ప్లే, ఆపిల్ ప్లే స్టోర్లో ఈ యాప్లు మన దేశంలో డౌనలోడ్ చేసుకునే అవకాశం లేకుండా పోయింది. అయితే, అదివరకే వీటిని డౌన్లోడ్ చేసుకున్న వినియోగదారులు మాత్రం తమ మొబైల్లో ఈ గేమ్లను ఆడుకునే అవకాశం ఉన్నది. కాగా..చైనాకు చెందిన టెన్సెంట్ గేమ్స్ నుంచి ఈ గేమ్ను తమ అధీనంలోకి తీసుకుని దీన్ని భారత్లో కొనసాగించడానికి పబ్జీ కార్పొరేషన్ చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి.
దీంతో అక్టోబర్ 30 నుంచి భారత్లో పబ్జీ సర్వీసులను పూర్తిగా తొలగిస్తున్నట్లు తన అధికారిక ఫేస్బుక్ పేజ్లో పబ్జీ ప్రకటించింది. వినియోగదారుల డాటాను పరిరక్షించడమే తమ ప్రథమ ప్రాధాన్యతని, డాటా సంరక్షణ చట్టాలు, నిబంధనలను తాము భారత్లో నిరంతరం అమలుచేశామని పబ్జీ మొబైల్ తెలిపింది. కాల్ ఆప్ డ్యూటీ, మొబైల్ అండ్ ఫోర్ట్నైట్ వంటి తన పోటీదారుల కన్నా ఎన్నో రెట్లు అధికంగా భారత్లో పబ్జీ మొబైల్కు నెలకు దాదాపు 5 కోట్ల మంది యాక్టివ్ యూజర్లు ఉన్నట్లు టెక్ క్రంచ్ వెల్లడించింది. శుక్రవారం ఉదయం ట్విట్టర్లో పబ్జీమొబైల్ ట్రెండింగ్ అయింది. పబ్జీ గేమ్ నిషేధంపై పలువురు వినియోగదారులు తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు.