Thursday, April 25, 2024

మునుగోడులో పువ్వాడ అజయ్ ప్రచారం….

- Advertisement -
- Advertisement -

నల్లగొండ: మునుగోడు ఉప ఎన్నికలో టిఆర్‌ఎస్‌ గెలుపే లక్ష్యంగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్  స్వయంగా రంగంలోకి దిగారు. మంత్రికి ఓ యూనిట్ బాధ్యతలను అప్పగించగా స్థానిక నేతలతో కలిసి ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఇంటింటికెళ్లి తెలంగాణ సర్కార్‌ అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తున్నారు. గురిపెట్టిన బాణంలాంటి వ్యూహం, కాలాన్ని సైతం మార్చగల కర్తవ్యం, మంత్రముగ్ధం చేసే మాట, పరిణత, ఉద్దండుల్ని మించిన రాజకీయ చతురత ఇవన్నీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ లో మెండుగా ఉన్నందున వాటిని ఈ ఎన్నికలో గెలుపు అస్త్రాలుగా మంత్రి ప్రయోగిస్తారని పువ్వాడ అనుచరగణం ద్వారా తెలుస్తోంది. తన చాణక్యం, వ్యూహలకు ప్రతివ్యూహాలు రచనలో మంత్రి అజయ్ ఇప్పటికే నిమగ్నమయ్యారని పేర్కొన్నారు.

తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను నియోజకవర్గంలోని ఇంటింటికీ తిరిగి ప్రతి ఓటరుకూ వివరించేలా టిఆర్‌ఎస్‌ ప్రచార వ్యూహాన్ని రూపొందించింది. ముఖ్యంగా మునుగోడు నియోజకవర్గంలో ఫ్లోరైడ్‌ భూతంతో ఇరవైలోనే అరవై ఏండ్ల ఛాయలతో కునారిల్లిన జనానికి మిషన్‌ భగీరథ నీరు సంజీవనీలా మారిన విధానాన్ని ప్రపంచం మొత్తం చూసింది. మరోవైపు రాజకీయాలకు అతీతంగా అర్హుడైన ప్రతి ఒక్కరూ ప్రభుత్వ సంక్షేమ ఫలాలను పొందుతున్న వాస్తవాలు కూడా నియోజకవర్గ ప్రజల మదిలో ఉన్నాయి. మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో పక్కా ప్రణాళికబద్ధంగా వ్యవహరించేందుకు భారత్‌ రాష్ట్ర సమితిగా ఆవిర్భవించబోతున్న తెలంగాణ రాష్ట్ర సమితి సిఎం కెసిఆర్ ఆదేశాల మేరకు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గులాబీ దళం కొరటికల్ గ్రామంలో ప్రచారం నిర్వహించారు. ఇందులో భాగంగానే ప్రజల్లో మాస్‌ ఫాలోయింగ్‌ కలిగిన నేత మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ను ఎంచుకుని ప్రచార బాధ్యతలను అప్పగించింది. బాధ్యతలు ఇవ్వడం ద్వారా పోలింగ్‌ తేదీ నాటికి విరామం లేకుండా ప్రచారం చేయాలని అధిష్టానం ఆదేశాలు జారీ చేసింది. దసరా పర్వదినం సందర్భంగా ఆవిర్భవించిన భారత్‌ రాష్ట్ర సమితి స్ఫూర్తితో గులాబీ శ్రేణులు పెద్ద ఎత్తున మునుగోడు పోరులో సత్తా చాటనున్నారు. జాతీయ పార్టీగా అవతరించిన  బిఆర్‌ఎస్‌ ఏర్పాటు అనంతరం జరుగుతున్న తొలి ఎన్నికలు కావడంతో అధిష్టానం అత్యంత పకడ్బందీగా వ్యవహరిస్తోంది. భారీ మెజార్టీతో గులాబీ పార్టీ అభ్యర్థిని గెలిపించడమే ధ్యేయంగా కార్యాచరణ ప్రణాళిక అమలు కానున్నది. రాష్ట్ర ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల ఇంటింటికెళ్లి వారి మద్దతును కూడగట్టనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News