ఇల్లందు: ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి రాష్ట్రంలో జరిగిన ప్రతి ఎన్నికలలో తెరాస ఆధిపత్యం కొనసాగుతోందని, అదేవిధంగా రానున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో సైతం టిఆర్ఎస్ అభ్యర్థుల గెలుపు ఖాయమని రాష్ట్ర రవాణా శాఖమంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. ఎమ్మెల్యే బానోత్ హరిప్రియానాయక్ అధ్యక్షతన పట్టణంలో జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఉద్యమ నాయకుడయిన కెసిఆర్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నాటినుండి ప్రజల ప్రతి సమస్యకు పరిష్కారం చూపుతుండడంతో ప్రతి ఎన్నికల్లో టిఆర్ఎస్ గెలుపు నల్లేరుపైనడకలా సాగుతుందన్నారు. రానున్న ఎమ్మెల్సీ ఎన్నికలు పార్టీకి ప్రతిష్టాత్మకమని, మార్చిలో జరగనున్న ఎన్నికల్లో గెలుపు కోసం నేటినుండే సన్నద్దం కావాల్సిన ఆవశ్యకత వుందన్నారు.
గ్రామగ్రామాన పట్టభధ్రులను గుర్తించి వారిని ఓటరుగా చేర్చాలని, ఓ ప్రణాళిక ప్రకారం పట్టభద్రుల ఓట్లను ఎన్రోల్మెంట్ చేయించాలని తెలిపారు. 2017 నాటికి డిగ్రీ పూర్తి చేసిన ప్రతి ఒక్కరి వివరాలను సేకరించేందుకు నియోజకవర్గ పరిధిలో ప్రతి గ్రామంలో భాద్యుడిని నియమించుకోవాలని ఎన్నికల కన్వీనర్లకు సూచించారు. రైతులకు 24గంటల ఉచిత విద్యుత్, పంట రుణాలు, విద్యార్థులకు స్కాలర్షిప్లు, కళ్యాణలక్ష్మి, షాదీముబారక్, రైతుభీమా తదితర 92పథకాలను విజయవంతంగా అమలు చేస్తున్న ఏకైక ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వమే అన్నారు.
ముఖ్యమంత్రి కెసిఆర్ నిర్ణయించిన పార్టీ అభ్యర్థికి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పట్టభద్రుల మద్దతు కూడగట్టేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఎన్నికల ఇంఛార్జి భరత్ కుమార్, పార్టీ రాష్ట్ర నాయకులు బానోత్ హరిసింగ్ నాయక్, జడ్పీ ఛైర్మన్ కోరకం కనకయ్య, జిల్లా గ్రంథాలయసంస్థ ఛైర్మన్ దిండిగాల రాజేందర్, మున్సిపల్ ఛైర్పర్సన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు, వైస్ఛైర్మన్ జానీపాషా, రైతు సమన్వయసమితి సలహాదారులు పులిగండ్ల మాధవరావు, నాయకులు సిలివేరు సత్యనారాయణ, లక్కినేని సురేందర్, మేకల మల్లిబాబు, తాతా గణేష్, మూల మధుకర్రెడ్డి, లకవాత్ దేవీలాల్నాయక్, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.