న్యూఢిల్లీ: కరోనా వైరస్ కారణంగా దేశం లాక్డౌన్లోకి వెళ్లిపోయి ప్రజలు తీవ్ర కష్టాలను ఎదుర్కొంటున్న సమయంలో ప్రభుత్వం మాత్రం ధనార్జనలో నిమగ్నమైందని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. లాక్డౌన్ సమయంలో వలస కార్మికులను వారి గమ్యస్థానాలకు చేర్చడానికి నడిపిన శ్రామిక్ స్పెషల్ రైళ్ల ద్వారా భారతీయ రైల్వేలు భారీ లాభాలను మూటగట్టుకున్నాయని పేర్కొంటూ వెలువడిన ఒక పత్రికా వార్తను రాహుల్ శనివారం తన ట్వీట్కు జతచేశారు. శ్రామిక్ స్పెషల్ రైళ్ల ద్వారా రైల్వేలకు రూ. 428 కోట్ల భారీ లాభాలు వచ్చాయంటూ ఆ వార్త పేర్కొంది. దీనిపై రాహుల్ స్పందిస్తూ వ్యాధి మేఘాలు అలుముకుని ప్రజలు కష్టాలలో ఉండగా ఈ ప్రజావ్యతిరేక ప్రభుత్వం మాత్రం విపత్తును కూడా తన లాభార్జనకు మార్చుకుంటోందని ఆరోపించారు. కాగా, మరో ట్వీట్లో తాను కొద్దికాలం క్రితం సూచించిన మేరకు ఒక జిల్లా, ఒక వస్తువును ఎంపిక చేసేందుకు సర్వే నిర్వహిస్తున్న హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆయన అభినందించారు.
Rahul Gandhi accuses Central Govt of making profits