న్యూఢిల్లీ: లాక్ డౌన్ నేపథ్యంలో పేదలు, వలసకార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. శనివారం రాహుల్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మీడియాతో మాట్లాడుతూ… భారత్ నిర్మాణంలో వలస కార్మికుల పాత్ర కీలకమని పేర్కొన్నారు. దేశం మొత్తం వలస కార్మికులకు మద్దతుగా నిలవాలని కోరారు. భారత్ వలస కూలీలకు అండగా ఉందనే సందేశం చేరవేయాలన్నారు. లక్షల మంది వలస కూలీలు కాలినడకన సొంతూళ్లకు వెళ్తున్నారని తెలిపారు.
మార్గమధ్యలో ఆహార సదుపాయాలు లేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం జాగ్రత్తలు వహిస్తూ… లాక్ డౌన్ ఎత్తివేతకు చర్యలు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. జేబుల్లో డబ్బులు లేకపోతే పేద ప్రజలు ఏమీ కొనుక్కోలేని పరిస్థితి ఏర్పడుతుందని, పేదప్రజలు జేబుల్లోకి డబ్బులు నేరుగా చేరే విధంగా చూడాలన్నారు. ఆర్థిక ప్యాకేజీ విషయంలో ప్రధాని పునరాలోచించాలని రాహుల్ పేర్కొన్నారు. వలస కూలీలు, ప్రజలకు రాజకీయ సందేశం అక్కర్లేదని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు.
LIVE! Regional Electronic Media Press Conference. https://t.co/Yz65SxSqqC
— Rahul Gandhi (@RahulGandhi) May 16, 2020