పెగాసస్ వ్యవహారంపై భవిష్యత్తు వ్యూహంపై చర్చ
వాయిదా తీర్మానాల ప్రతిపాదనకు నిర్ణయం
న్యూఢిల్లీ: పార్లమెంటును కుదిపేస్తున్న పెగాసస్ ఫోన్ హ్యాకింగ్పై చర్చించేందుకు ప్రతిపక్షాలు బుధవారం సమావేశమైనాయి. ఈ నెల 19న పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమైనప్పటినుంచీ ప్రతిపక్షాల గొడవతో ఉభయ సభలు ఒక్క రోజు కూడా సాఫీగా సాగిన పాపాన పోలేదు. ఈ వ్యవహారంపై చర్చకు విపక్షాలు పట్టుబడుతున్నప్పటికీ ప్రభుత్వం అందుకు సిద్ధంగా లేదు. దీంతో ఈ వ్యవహారంపై ఉభయ సభల్లోను ఒకే రకమైన వాయిదా తీర్మానాలను సమర్పించాలని ఈ సమావేశంలో విపక్షాలు నిర్ణయించాయి. రాజ్యసభలో విపక్ష నేత మల్లికార్జున ఖర్గే చాంబర్లో జరిగిన ఈ సమావేశానికి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కూడా హాజరయ్యారు.
కాంగ్రెస్ సీనియర్ నేతలతో పాటుగా శివసేన, సిపిఐ, సిపిఎం, ఆర్జెడి, ఆమ్ఆద్మీ పార్టీ, డిఎంకె, సమాజ్వాది పార్టీ సహా 14 పార్టీలకు చెందిన ప్రధాన నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. సమావేశం అనంతరం రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడుతూ, పెగాసస్, ధరల పెరుగుదల, రైతుల సమస్యలపై తాము రాజీ పడేది లేదని, స్రజాసమస్యలను లేవనెత్తడం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. కాగా ప్రతిపక్షాలు పార్లమెంటును నడవనీయడం లేదని నిందించడం ద్వారా ప్రభుత్వం విపక్షాలను అపఖ్యాతి పాలు చేయడానికి ప్రయత్నిస్తోందని అంతకు ముందు సమావేశంలో రాహుల్ అన్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ప్రతిపక్షాల ప్రజలు, రైతులు, దేశ భద్రతకు సంబంధించిన అంశాలను మాత్రమే లేవనెత్తుతున్నాయని, ఇకపై కూడా లేవనెత్తునే ఉండాయని ఆయన అన్నట్లు ఆ వర్గాలు తెలిపాయి.