Friday, March 29, 2024

ప్రపంచకప్‌ను వెంటాడుతున్న వరుణుడు

- Advertisement -
- Advertisement -

మరో రెండు మ్యాచ్‌లు వర్షార్పణం

మెల్‌బోర్న్: టి20 ప్రపంచకప్‌ను వర్షం వెంటాడుతోంది. శుక్రవారం తాజాగా మరో రెండు మ్యాచ్‌లు వర్షం వల్ల ఒక్క బంతి కూడా పడకుండానే రద్దయ్యాయి. సూపర్12లో భాగంగా శుక్రవారం ఐర్లాండ్‌అఫ్గానిస్థాన్, ఆస్ట్రేలియాఇంగ్లండ్ జట్ల మధ్య జరగాల్సి మ్యాచ్‌లు వర్షం వల్ల రద్దు చేయక తప్పలేదు. రెండు మ్యాచుల్లో కూడా కనీసం టాస్ వేసే పరిస్థితి కూడా లేకుండా పోయింది. ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న ప్రపంచకప్‌లో వర్షం వల్ల ఇప్పటికే నాలుగు మ్యాచ్‌లు అర్ధాంతరంగా రద్దు కాక తప్పలేదు. ఇందులో రెండు మ్యాచులు ఒక్క అఫ్గానిస్థాన్‌కు సంబంధించినవే కావడం గమనార్హం. సాధారణంగా టి20 ప్రపంచకప్‌లో ఉత్కంఠ పోరులు, సంచలన విజయాలు, మైదానాల్లో అరుపులు, నిప్పులు చెరిగే బంతులు, పోటాపోటీగా ఫోర్లు, సిక్సర్లు ఉంటాయి. ప్రతి మ్యాచ్ చివరి బంతి వరకు ఉత్కంఠభరితంగా సాగడం అనవాయితీ. ఈ ప్రపంచకప్‌లో భారత్‌పాకిస్థాన్, జింబాబ్వేపాకిస్థాన్, ఇంగ్లండ్‌ఐర్లాండ్ ల మధ్య జరిగిన మ్యాచ్‌లు దీనికి నిదర్శనంగా చెప్పాలి. ఇలా ఉత్కంఠభరితంగా సాగుతున్న ప్రపంచకప్‌కు వరుణుడు విలన్‌గా మారాడు.

ఈ పొట్టి ప్రపంచకప్‌లో వరుణుడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. వరుణుడి దెబ్బకు ఇప్పటికే నాలుగు మ్యాచ్‌లు బలైపోయాయి. దక్షిణాఫ్రికా, అఫ్గానిస్థాన్, ఇంగ్లండ్ తదితర జట్లకు వర్షం తీరని నష్టం కలిగించింది. రెండు మ్యాచ్‌లు రద్దు కావడంతో అఫ్గాన్ సెమీ ఫైనల్ అవకాశాలను క్లిష్టంగా మార్చింది. ఇక ఐర్లాండ్‌తో గెలిచే స్థితిలో ఉండి కూడా ఇంగ్లండ్ ఓటమి పాలుకాక తప్పలేదు. ఇక దక్షిణాఫ్రికాకు కూడా ఇలాంటి ఫలితమే ఎదురైంది. జింబాబ్వేతో జరిగిన పోరులో 24 బంతుల్లో 13 పరుగులు చేయాల్సిన సమయంలో వర్షం రావడంతో మ్యాచ్‌ను అర్ధాంతరంగా రద్దు చేయక తప్పదు. దీంతో గెలవాల్సిన మ్యాచ్‌లో సౌతాఫ్రికా డ్రాతో సంతృప్తి పడగా జింబాబ్వే ఓటమి కోరల్లో నుంచి బయటపడి ఒక పాయింట్‌ను తన ఖాతాలో వేసుకుంది. మరోవైపు న్యూజిలాండ్‌అఫ్గానిస్థాన్, అఫ్గానిస్థాన్‌ఐర్లాండ్, ఆస్ట్రేలియాఇంగ్లండ్‌ల మధ్య జరగాల్సి మ్యాచ్‌లు కూడా వర్షార్పణం అయ్యాయి. ఈ మూడు మ్యాచ్‌లు కూడా కనీసం టాస్ కూడా వేయకుండానే రద్దయ్యాయి. ఈ మూడు మ్యాచ్‌లు కూడా మెల్‌బోర్న్ వేదికగానే జరగడం గమనార్హం.

సెమీస్ బెర్త్‌లపై ప్రభావం

ప్రపంచకప్‌లో ఇప్పటికే నాలుగు సూపర్12 మ్యాచ్‌లు వర్షం వల్ల అర్ధాంతరంగా రద్దు కావడంతో దాని ప్రభావం ఆయా జట్ల సెమీ ఫైనల్ బెర్త్‌లపై పడడం ఖాయంగా కనిపిస్తోంది. ముఖ్యంగా గ్రూప్1లో సెమీస్ బెర్త్‌లు క్లిష్టంగా మారాయి. ఇప్పటికే నాలుగు జట్లు మూడేసి పాయింట్లతో ఉన్నాయి. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా వంటి పెద్ద జట్లు మూడు మ్యాచుల్లో కేవలం ఒక విజయం మాత్రమే సాధించాయి. న్యూజిలాండ్ మాత్రం రెండు మ్యాచ్‌లు ఆడి ఒకదాంట్లో గెలిచింది. మరో మ్యాచ్ వర్షార్పణం అయ్యింది. ఈ పరిస్థితుల్లో కివీస్‌కు సెమీస్ అవకాశాలు కాస్త మెరుగ్గా ఉన్నాయి. అయితే అఫ్గాన్ రెండు మ్యాచ్‌లను కోల్పోవడంతో సెమీస్ బెర్త్‌కు దాదాపు దూరమైందనే చెప్పాలి. పసికూన ఐర్లాండ్ పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతోంది. అఫ్గాన్‌తో మ్యాచ్ రద్దు కావడం ఆ జట్టుకు కలిసి వచ్చింది. ఇక గ్రూప్2లో పరిస్థితి కాస్త మెరుగ్గా ఉంది. భారత్ రెండు మ్యాచుల్లో గెలిచి నాలుగు పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఇక సౌతాఫ్రికాతో మ్యాచ్ రద్దు కావడం జింబాబ్వేకు కలిసి వచ్చింది. ప్రస్తుతం జింబాబ్వే మూడు పాయింట్లతో సెమీస్ రేసులో నిలిచింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News