మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో రానున్న ఐదు రోజులపాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. నైరుతి రుతుపవనాల చురుగ్గా కదులుతుండడంతో రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణతో పాటు పశ్చిమ మధ్యప్రదేశ్లోని కొన్ని ప్రాంతాలు, తూర్పు మధ్యప్రదేశ్లోని మరికొన్ని ప్రాంతాలు, తూర్పు ఉత్తరప్రదేశ్లోని మరికొన్ని ప్రాంతాల్లోకి నైరుతి రుతుపవనాలు విస్తరించాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. తూర్పు విదర్భ దాని పరిసర ప్రాంతాల్లో 5.8 కిలోమీటర్ల నుంచి 7.6 కిలోమీటర్ల ఎత్తులో మధ్య ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని తెలిపింది. ఉత్తర బంగాళాఖాతం దాని పరిసర ప్రాంతాల్లో జూన్ 19వ తేదీన అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. బుధవారం నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, ఆదిలాబాద్, కొమరం భీమ్, నిర్మల్, మంచిర్యాల జిల్లాలలో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది.
హైదరాబాద్లో భారీ వర్షం
నగరంలో మంగళవారం పలు చోట్ల వర్షం కురిసింది. నగరంలోని పంజగుట్ట, సనత్నగర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిలింనగర్, మాదాపూర్, కూకట్పల్లి, మియాపూర్, తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది. దీంతో జంట నగరాల్లో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. పలు చోట్ల రోడ్లపై వర్షం నీళ్లు నిలిచి వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. పలు చోట్ల ట్రాఫిక్ జాం కావడంతో వాహనదారుల రాకపోకలకు అంతరాయం కలింగింది.
Rains in next 5 days in Telangana