మనతెలంగాణ/హైదరాబాద్: ఒరిస్సా, దాని పరిసర ప్రాంతాల్లో మొదలైన ఉపరితల ఆవర్తనం ప్రస్తుతం చురుగ్గా కదులుతోందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో రాగల మూడురోజుల పాటు ఓ మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీస్తాయని, అక్కడక్కడ ఉరుములతో కూడిన తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఆదివారం రాత్రి, సోమవారం కొమరం భీం, మంచిర్యాల, పెద్దపల్లి, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, వరంగల్-పట్టణం, వరంగల్-గ్రామీణం, జనగాం, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.
మంగళవారం కొన్ని చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉత్తర ఒడిశా పరిసరాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం, రాజస్థాన్ నుంచి మధ్య భారతావని మీదుగా బంగాళాఖాతం వరకు విస్తరించిందని అధికారులు తెలిపారు. రుతుపవనాలకు తోడైన ఆవర్తనం, వాటిని మరింత చురుకుగా మార్చిందని, దీని ప్రభావంతో మంగళవారం వరకు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో కోస్తా, రాయలసీమతో పాటు తెలంగాణలోని పలు జిల్లాలో వర్షాలు కురుస్తాయని అధికారులు పేర్కొన్నారు.
Rains in next three days in Telangana