అయోధ్య: అయోధ్యలో నిర్మించనున్న రామ మందిరం సముదాయానికి చెందిన ఆకృతులపై సలహాలు ఇవ్వవలసిందిగా ఈ రంగంలో నిష్ణాతులైన ప్రజలకు రామ జన్మభూమి తీర్థ ట్రస్టు కోరింది. 70 ఎకరాలలో నిర్మించనున్న రామ మందిర సముదాయం కోసం ప్రస్తుతం రూపొందుతున్న మాస్టర్ ప్లాన్లో ప్రజలు ఇచ్చే సూచనలను పొందుపరుస్తామని కొన్ని ప్రధాన జాతీయ దినపత్రికలకు జారీచేసిన ప్రకటనలో ట్రస్టు పేర్కొంఇ. రామ మందిర నిర్మాణ బాధ్యతలను ప్రముఖ నిర్మాణ సంస్థ లార్సన్ అండ్ టూబ్రోకు ట్రస్టు ఇప్పటికే అప్పగించింది. అంతేగాక ఆలయ నిర్మాణంలో టాటా కన్సల్టింవ అండ్ ఇంజనీరింగ్ సంస్థకు చెందిన ఇంజనీర్లు, నిపుణులను కూడా ట్రస్టు చేర్చింది. ఆలయ శంకుస్థాపనకు సంబంధించి ఐఐటి-రూర్కీ, ఐఐటి-మద్రాసు నుంచి నిపుణుల సలహాలను కూడా ట్రస్టు ఆహ్వానించింది. అన్ని ప్రకృతి విపత్తులను తట్టుకుని కనీసం వెయ్యి సంవత్సరాల పాటు చెక్కు చెదరకుండా నిలబడే అత్యంత పటిష్టమైన బ్రహ్మాండమైన ఆలయాన్ని నిర్మించాలన్నదే తమ ఆశయమని ట్రస్టు సభ్యులు తెలిపారు.
రామ మందిర మాస్టర్ప్లాన్లో పొందుపరచడానికి ప్రపంచవ్యాప్తంగా నిపుణుల నుంచి సలహాలు ఆహ్వానిస్తున్నామని ట్రసు సభ్యుడు డాక్టర్ అనిల్ మిశ్రా తెలిపారు. ప్రధానంగా తీర్థ యాత్ర, పూజాదికాలు, సంస్కృతి, విజ్ఞానానికి సంబంధించిన అంశాలలో సలహాలు ఆహ్వానిస్తున్నట్లు ఆయన చెప్పారు. నిపుణుల, ఆర్కిటెక్టులు, డిజైనర్లు తమ సూచనలను నవంబర్ 25వ తేదీ లోపు ట్రస్లుకు ఈమెయిల్ చేయాలని ఆయన చెప్పారు. అయోధ్యలో ఏటా దీపావళి పండుగ తర్వాత అత్యంత వైభవంగా జరిగే పరిక్రమ ఉత్సవానికి భక్తులను అనుమతించడం లేదు. మూడు రోజుల పాటు దీపోత్సవ వేడుకలలో కేవలం సాధువులు, పీఠాధిపతులు మాత్రమే పాల్గొంటారు.