సిద్దిపేట: ఆనాడు తెలంగాణ ప్రకటన వచ్చిన రోజు ఎంత సంతోషంగా ఉందో… ఇప్పుడు కూడా అంతే సంతోషంగా ఉందని మంత్రి హరీష్ రావు తెలిపారు. రంగనాయక సాగర్ జలాశయంలోకి గోదావరి జలాలను మంత్రులు హరీష్ రావు, కెటిఆర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా హరీష్ రావు మీడియాతో మాట్లాడారు. తెలంగాణ అభివృద్ధిలో వలస కూలీలు భాగమని కొనియాడారు. ప్రాజెక్ట్ నిర్మాణంలో పాలు పంచుకున్న కూలీలు, ఇంజనీర్లు, రెవెన్యూ ఉద్యోగులు, ప్రభుత్వాధికారులకు పాదాభివందనం చేస్తున్నానని ప్రశంసించారు. ఈ ప్రాజెక్టు నిర్మాణంలో రెండు మూడు సంవత్సరాల నుంచి పని చేస్తున్నా కూలీలను సన్మానం చేస్తామన్నారు. అసాధ్యమైన పనిని ఇవాళ సిఎం కెసిఆర్ సుసాధ్యం చేశారని హరీష్ రావు పొగిడారు. సిద్దిపేటకు గోదావరి జలాలు రావడం దశాబ్దాల కల అని, సిఎం కెసిఆర్ అవిశ్రాంతంగా శ్రమించి సిద్దిపేట వాసుల చిరకాల స్వప్నాన్ని నెరవేర్చారని ప్రశంసించారు. సిద్ది పేట దగ్గర 2300 ఎకరాల్లో రూ.3300 కోట్లతో జలాశయం నిర్మాణం చేపట్టమన్నారు. గతంలో మెదక్ జిల్లా అంటే ఆకలి చావులు, రైతుల ఆత్మహత్యలు, వలసల జిల్లాగా మార్చారని, సమైక్య రాష్ట్రంలో మెదక్కు ఒక్క ఎకరానికి కూడా నీళ్లు ఇవ్వలేదని, ఇలాంటి జిల్లాకు ఏకంగా గోదావరి జలాలను సిఎం కెసిఆర్ తెచ్చారని ప్రశంసించారు. కాలం, కరెంట్తో పని లేకుండా రైతులు పంటలు పండించుకోగల అదృష్టం సిద్దిపేట రైతులకు దక్కిందన్నారు.