లక్నో: జాతీయ స్థాయి ఖో ఖో క్రీడాకారిణిపై ఓ వ్యక్తి అత్యాచారం చేస్తుండగా ప్రతిఘటించడంతో ఆమెను గొంతు నులిమి హత్య చేసిన సంఘటన ఉత్తర ప్రదేశ్లోని బిజ్నోర్ రైల్వే స్టేషన్ సమీపంలో జరిగింది. బాధితురాలు ఆడియో క్లిప్ తన స్నేహితుడికి షేర్ చేయడంతో నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. దళిత యువతి జాతీయ స్థాయిలో ఖో ఖో ఆట ఆడుతుంది. గత శుక్రవారం సదరు యువతి ఓ ఇంటర్వ్యూకు వెళ్లి ఇంటికి తిరిగొస్తుంది. బిజ్నోర్ రైల్వే స్టేషన్లో దిగి నడుస్తుండగా షాజాద్ ఖాదీమ్ అనే యువకుడు ఆమెను సిమెంట్ లోడ్తో ఉన్న రైల్వే బోగీలోకి లాక్కెళ్లాడు. ఆమెపై అత్యాచారం చేయబోతుండగా ప్రతిఘటించి తన స్నేహితుడికి ఫోన్ చేసి సహాయం చేయమని అడిగింది. చున్నీతో ఆమె మెడకు చుట్టి గొంతు నులిమి హత్య చేశాడు. ఫోన్లో నుంచి మాటలు రాకపోవడంతో వెంటనే స్థానిక పోలీసులకు స్నేహితుడు సమాచారం ఇచ్చాడు. ఘటనా స్థలం నుంచి నిందితుడు పారిపోయాడు.
పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేశారు. సిసి కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేయగా షాజాద్ ఖాదీమ్గా గుర్తించారు. వెంటనే అతడిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా తానే హత్య చేశానని ఒప్పుకున్నాడు. ఇద్దరు మధ్య పెనుగులాట జరిగినప్పుడు అతడి వీపుపై ఆమె గోర్లతో రక్కింది. అతడి వీపుపై ఉన్న గాయాల నుంచి రక్తాన్ని తీసుకొని డిఎన్ఎ కోసం ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించారు. గంజాయి లాంటి మత్తు పదార్థాలు సేవించేవాడు. గతంలో రైల్వే స్టేషన్లో దొంగతనం చేసిన కేసులు అతడిపై ఉన్నాయని స్థానిక ఎస్పి ధరమ్వీర్ సింగ్ తెలిపాడు. ఈ కేసును మూడు రోజుల్లో ఛేదించినందుకు పోలీసులకు రూ.25000 రివార్డును ఎస్పి అందజేశారు.