న్యూఢిల్లీ: విద్వేషపూరిత ప్రసంగాలకు వ్యతిరేకంగా చర్యలు చేపట్టని ఢిల్లీ పోలీసులపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి ఎస్ మురళీధర్ ను కొద్ది గంటలకే బదిలీ చేయడంపై కాంగ్రెస్ విమర్శలకు కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ గురువారం స్పందించారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్ఎ బాబ్డే సారథ్యంలోని కొలీజియం సిఫార్సు మేరకే జస్టిస్ మురళీధరన్ను బదిలీ చేశామని, న్యాయమూర్తి ఆమోదంతోనే బదిలీ జరిగిందని కేంద్ర మంత్రి వివరించారు. న్యాయమూర్తి బదిలీకి సంబంధించి అన్ని ప్రక్రియలను పాటించడం జరిగిందని ఆయన ట్వీట్ చేశారు. ఒక సాధారణ బదిలీని రాజకీయం చేస్తూ న్యాయవ్యవస్థ పట్ల అగౌరవాన్ని కాంగ్రెస్ ప్రదర్శించిందని ఆయన విమర్శించారు.
కాంగ్రెస్ పార్టీని దేశ ప్రజలు తిరస్కరించారని, అందుకే దేశంలోని అత్యున్నత వ్యవస్థలను ధ్వంసంచేసేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు. అంతకుముందు కాంగ్రెస్ నాయకుడు రణదీప్ సుర్జీవాలా న్యాయమూర్తి జస్టిస్ మురళీధరన్ బదిలీని బిజెపి ప్రభుత్వ కొట్టి పారిపోయే అన్యాయ చర్యగా అభివర్ణించారు. విద్వేషపూరిత ఉపన్యాసాలు చేసిన బిజెపి నాయకులపై దాఖలైన కేసులను జస్టిస్ మురళీధరన్ విచారణ జరుపుతున్నారని, బిజెపి అచరిస్తున్న ప్రతీకార, ఒత్తిడి రాజకీయాలను తాజా చర్య బహిర్గతం చేస్తోందని ఆయన విమర్శించారు.
ఇలా ఉండగా, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా గురువారం తెల్లవారుజామున ఒక ట్వీట్ చేస్తూ జస్టిస్ మురళీధరన్ను రాత్రికి రాత్రే బదిలీ చేయడం ప్రస్త్తుత ప్రభుత్వ పాలనలో దిగ్భ్రాంతికరమైన విషయం కానప్పటికీ చాలా విచారకరం, అవమానకరమని వ్యాఖ్యానించారు. న్యాయవ్యవస్థ సచ్ఛీలత పట్ల కోట్లాది మంది ప్రజలకు అపార విశ్వాసం ఉందని, కాని న్యాయవ్యవస్థ గొంతు నులిమి ప్రజల విశ్వాసాన్ని వమ్ము చేయడం గర్హనీయమని ఆమె అన్నారు.