రోజుకు 60వేల మంది భక్తులకు స్వామి వారి దర్శనంతో పాటు
నెయ్యాభిషేకం ఉదయం 7 గంటల నుంచి 12 వరకు
భక్తులు చేసుకునేలా మార్గదర్శకాలు
ఈనెల 19వ తేదీ నాటికి శబరిమలకు 8,11,235 మంది భక్తుల రాక
మనతెలంగాణ/హైదరాబాద్: అయ్యప్ప స్వామి దర్శనం కోసం శబరిమలకు వచ్చే భక్తుల కోసం ఆంక్షలు సడలిస్తున్నట్లు కేరళ ప్రభుత్వం ప్రకటించింది రోజుకు 60వేల మంది భక్తులు ఆలయాన్ని దర్శించుకునేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు ట్రావెన్కోర్ బోర్డు పేర్కొంది. గతంలో రోజుకు 30 వేల మందికి మాత్రమే దర్శనభాగ్యం కల్పించిన ట్రావెన్కోర్డు బోర్డు ప్రస్తుతం ఈ నిర్ణయం తీసుకుంది. కేరళలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో శబరిమల ఆలయంపై విధించిన ఆంక్షలను ప్రభుత్వం సడలించింది. మండల పడిపూజ సందర్భంగా భక్తులు ఆలయంలో నెయ్యితో అభిషేకం చేసేందుకు అనుమతించింది. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు ఈ సడలింపు వర్తింప చేస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. కొవిడ్ నిబంధనలను పాటిస్తూ భక్తులు అడవి మార్గం ద్వారా భక్తులు ప్రయాణించేందుకు కేరళ ప్రభుత్వం అనుమతించింది. ఆదివారం (19వ తేదీ) నాటికి 8,11,235 మంది భక్తులు శబరిమల అయ్యప్పస్వామిని దర్శించుకున్నట్టు ట్రావెన్కోర్ అధికారులు తెలిపారు. ఈ సీజన్లో అత్యధికంగా శనివారం ఒక్కరోజే 42,870 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు.