జెనీవా/జ్యురిచ్ : కరోనా నియంత్రణ కోసం గిలియడ్ సైన్స్ సంస్థకు చెందిన రెమ్డెసివిర్ ఔషధాన్ని వెలుగు లోకి తెచ్చే ముందు ఒక ట్రయిల్లో వచ్చిన వైఫల్యంతోపాటు, ఇతర పూర్తి ఆధారాలన్నీ తప్పనిసరిగా పరిశీలించ వలసి ఉంటుందని, ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన అగ్రస్థాయి శాస్త్రవేత్త శుక్రవారం స్పష్టం చేశారు. ఈ వారంలో ఈ ఔషధాన్ని వినియోగానికి అనుమతించడానికి ముందు అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్డిఎ) ఆమేరకు అంతగా పరిశీలించినట్టు కనిపించ లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ శాస్త్రవేత్త సౌమ్య స్వామినాధన్ పాత్రికేయ సమావేశంలో వెల్లడించారు. కొవిడ్ 19తో ఆస్పత్రిలో చేరిన వారికి చికిత్స కోసం రెమ్డెసివిర్ను గురువారం ఎఫ్డిఎ అనుమతించింది. అమెరికాలో అనుమతి పొందిన మొట్టమొదటి ఔషధం రెమ్డెవివిర్ మాత్రమే. కరోనా రోగులపై ఈ జౌషధం స్పల్ప ప్రభావం లేదా అసలు ప్రభావం చూపించక పోవడం జరుగుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ అధికారిక పరీక్ష ఫలితాలు విడుదలైన వారం తరువాతనే ఎఫ్డిఎ అనుమతించడం విశేషం.
అయితే మూడు ట్రయల్స్ ఆధారంగా తాము అనుమతించామని ఎఫ్డిఎ చెబుతోంది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అలెర్జీ అండ్ ఇన్ఫెక్షియస్ డిసీజ్ 1062 మంది రోగులను అధ్యయనం చేయగా రెమ్డెసివిర్ చికిత్స వల్ల ఆస్పత్రిలో రోగులు ఉండే కాలం పదిహేను రోజుల నుంచి నుంచి పదిరోజులకు తగ్గిందని, అలాగే ఆక్సిజన్ తీసుకున్న కొంతమంది రోగుల్లో మరణించే రిస్కు తగ్గించిందని అందుకే తాము అనుమతించినట్టు ఎఫ్డిఎ వెల్లడించింది. అయితే జీవించే అవకాశాన్ని ఈ డ్రగ్ అభివృద్ధి చేయలేదు. రోగులకు ఈ ప్రయోజనాలను ప్రపంచ ఆరోగ్య సంస్థ అధికారిక పరీక్ష వ్యతిరేకించలేదని ఎఫ్డిఎ తన వెబ్సైట్లో ప్రకటించింది. జపాన్, తైవాన్, భారత్, సింగపూర్, యుఎఇ, ఐరోపా యూనియన్ దేశాల్లో తీవ్రమైన కొవిడ్ 19 రోగులకు చికిత్స చేయడానికి రెమ్డెసివిర్కు అనుమతి లభించింది. అలాగే 127 స్పల్పాదాయ దేశాల్లో రెమ్డెసివిర్ తయారీకి జెనరిక్ కంపెనీలకు గిలియడ్ వీలు కల్పించింది.