Wednesday, April 24, 2024

నేరాలపై వెంటనే స్పందించాలి

- Advertisement -
- Advertisement -

Respond immediately to crimes: Stephen Ravindra

పాత కేసుల్లో దర్యాప్తు వేగవంతం చేయాలి
ఎస్సి,ఎస్టిలపై జరుగు నేరాల్లో దర్యాప్తు వేగం పెంచాలి
మాదక ద్రవ్యాల వ్యాపారులపై ఉక్కుపాదం మోపండి
లోక్ అదాలత్‌లో కేసులు పరిష్కరించిన పోలీసులకు ప్రశంసాపత్రాలు
క్రైం రివ్యూలో సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టిఫన్ రవీంద్ర

హైదరాబాద్: మహిళలు, పిల్లలపై జరుగు నేరాలపై పోలీసులు వెంటనే స్పందించి కేసులు నమోదు చేయాలని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టిఫెన్ రవీంద్ర అన్నారు. గచ్చిబౌలిలోని పోలీస్ కమిషనరేట్‌లో గురువారం ఆయన కమిషనరేట్ పరిధిలోని పోలీసు అధికారులతో క్రైం రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టిఫెన్ రవీంద్ర మాట్లాడుతూ కేసు నమోదు చేసిన తర్వాత నాణ్యతతో కూడిన దర్యాప్తు పూర్తి చేసి ఛార్జిట్‌ను అరవై రోజుల్లో కోర్టుకు సమర్పించాలని, పాత కేసులలో దర్యాప్తును వేగంగా పూర్తి చేయాలని కోరారు. ఎస్సీ,ఎస్టీలపై జరుగుతున్న నేరాల్లో దర్యాప్తు వేగవంతంగా పూర్తి చేయాలని దేశించారు. మహిళలు, పిల్లలు,ఎస్సి, ఎస్టి కేసులలో బాధితులకు ప్రభుత్వ పరంగా అందే పరిహారం త్వరగా అందేవిధంగా కృషి చేయాలని ఆదేశించారు. హైకోర్టులో రిట్ పిటీషన్లకు త్వరగా స్పందించి వాటికి కౌంటర్ రిపోర్టులను సకాలంలో సమర్పించవలసిందిగా కోరారు.

మార్చి12వ తేదీన నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్‌లో పోలీసులు మంచి పనితీరు కనబరిచినందుకు కానిస్టేబుల్ నుంచి ఆఫీసర్ వరకు అభినందించారు. మాదక ద్రవ్యాల సరఫరా, రవాణా చేయడం, వ్యాపారం చేసే వారిపై సేవించే వారిపై నిఘా పెట్టి సైబరాబాద్‌లో ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగే కార్యకలాపాలలో కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. ఎన్‌డిపిఎస్ చట్టం ప్రకారం అన్ని పద్దతులను దర్యాప్తు చేసే క్రమంలో పాటించి నాణ్యమైన విధంగా కేసులను కోర్టులో దర్యాప్తు అధికారులు సమర్పించాలని ఆదేశించారు. పాత కేసుల్లో ఎఫ్‌ఎస్‌ఎల్ రిపోర్టులను పెండింగ్‌లో ఉండుట వల్ల కేసులు త్వరగా కోర్టుకు సమర్పించలేకపోవడం వంటి కారణాలను తగ్గించాలని, ఎఫ్‌ఎస్‌ఎల్ ఆఫీస్‌కు పోలీసు అధికారులు వెళ్లి రిపోర్టులు తీసుకుని కోర్టులో సమర్పించాలని ఆదేశించారు. హిస్టరి షీట్స్, రౌడీషీటర్లపైన ఎస్‌హెచ్‌ఓలు నిఘాపెట్టి, సంఘ వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొనకుండా, శాంతిభద్రతలకు భంగం కలగకుండా చూడాలని ఆదేశించారు. విజిబుల్ పోలీసింగ్, ప్రొయాక్టివ్ పోలీసింగ్ పద్దతులను అవలంభించి గస్తీ వాహనాలు ఎల్లవేళల ప్రజలు తిరిగే ప్రాంతాలు, కూడళ్లలో ప్రజలకు అందుబాటులో ఉంచాలని అన్నారు. పగలు, రాత్రి అనే తేడా లేకుండా అన్ని వేళలా ప్రజలకు రక్షణ కల్పించాలని కోరారు. ఈ నెలలో నిర్వహించనున్న లోక్‌అదాలత్‌లో ఎక్కువ కేసులు పరిష్కారమయ్యే విధంగా చూడాలని అన్నారు.

రాబోయే బోనాలు, బక్రీద్ పండుగలకు ఇప్పటి నుంచే అప్రమత్తంగా ఉండాలని, దానికి అనుగుణంగా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. లోక్‌అదాలత్‌లో కేసులు పరిష్కరించినందుకు హైకోర్టు,రంగారెడ్డి కోర్టు నుంచి పోలీసులకు వచ్చిన ప్రశంసాపత్రాలను అందజేశారు. క్రైం డిసిపి కల్మేశ్వర్ సింగన్‌వార్, డిసిపి ఇందిర, ఎసిపి రవీచంద్ర, ఇన్స్‌స్పెక్టర్లు సురేష్, రవీంద్రప్రసాద్, కనకయ్యకు అందజేశారు. ఫంక్షనల్ వర్టికల్స్‌లో ఉత్తమ పనితీరు కనబర్చిన ఇన్స్‌స్పెక్టర్లు ధర్మేష్, వహీదుద్దిన్, సంజయ్‌కుమార్, రవీంద్రప్రసాద్, బాలరాజు, విజయ్‌భాస్కర్ రెడ్డి, శివకుమార్,శ్రీనివాస్, నర్సింగ్‌రావు, తిరుపతి రావు, ముత్తు యాదవ్‌కు ప్రశంసాపత్రాలు అందజేశారు. సమావేశంలో డిసిపిలు కల్మేశ్వర్, అనసూయ, శిల్పవల్లి, సందీప్, జగదీశ్వర్‌రెడ్డి, కవిత, ఇందిర, ఎడిసిపి రవికుమార్, సిఎఆర్ ఎడిసిపి రియాజ్, ట్రాఫిక్ ఎడిసిపి వెంకట్‌రెడ్డి, ఎసిపిలు, ఇన్స్‌స్పెక్టర్లు, డిఐలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News