ఢిల్లీ హైకోర్టు ఆదేశం
న్యూఢిల్లీ: ప్రభుత్వ ఉద్యోగి ఎవరూ పదవీ విరమణ తర్వాత తనకు కేటాయించిన ఇంటిలో కొనసాగకుండా చర్యలు తీసుకోవాలని ఢిల్లీ హైకోర్టు సోమవారం కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. పదవీ విరమణ తర్వాత చట్ట విరుద్ధంగా అదే ఇంటిలో కొనసాగుతున్న వ్యక్తిని ఖాళీ చేయించి ఆ వ్యక్తి నుంచి అక్రమంగా నివసించిన కాలానికి బకాయిలను వసూలు చేయాలని చీఫ్ జస్టిస్ డిఎన్ పటేల్, జస్టిస్ ప్రతీక్ జలన్లతో కూడిన హైకోర్టు ధర్మాసనం కేంద్ర హౌసింగ్ శాఖను ఆదేశించింది.
రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులు నివసిస్తున్న 565 ప్రభుత్వ గృహాలను ఖాళీ చేయించి వారి నుంచి రూ. 3 కోట్ల బకాయిలను వసూలు చేసినట్లు కేంద్ర హౌసింగ్, పట్టణ వ్యవహారాల మంత్రిత్వశాఖ తెలిపిందని హైకోర్టు పేర్కొంది. పదవీ విరమణ తర్వాత కూడా ప్రభుత్వ గృహాలలో కొనసాగుతున్న ఇతర వ్యక్తుల నుంచి వసూలు చేయాల్సిన రూ.9 కోట్ల బకాయిలను షోకాజ్ నోటీసులు ఇవ్వడం వంటి చర్యల ద్వారా రాబట్టేందుకు చర్యలు చేపట్టినట్లు కేంద్రం హైకోర్టుకు వివరించింది. ప్రభుత్వం చేపడుతున్న చర్యలను పురస్కరించుకుని దీనిపై దాఖలైన రెండు ప్రజాప్రయోజన వ్యాజ్యాలను కొట్టివేస్తున్నట్లు హైకోర్టు తెలిపింది.