Friday, April 19, 2024

బ్లాక్ ఫంగస్ ముప్పు పురుషులకే ఎక్కువ

- Advertisement -
- Advertisement -

Risk of Black Fungus is higher in men

వైద్య పరిశోధకుల వెల్లడి

ముంబై : రోజురోజుకీ బ్లాక్ ఫంగస్ (మ్యుకర్ మైకోసిస్ ) కేసులు ప్రమాదకరంగా పెరుగుతుండడంతో అంటువ్యాధుల జాబితా లోకి బ్లాక్‌ఫంగస్‌ను చేర్చాలని కేంద్రం నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఫంగస్ ముప్పు పురుషుల్లో ఎక్కువగా ఉన్నట్టు పరిశోధకులు వెల్లడించారు. కోల్‌కతా లోని జీడీ హాస్పిటల్ అండ్ డయాబెటిస్ ఇనిస్టిట్యూట్‌కు చెందిన డాక్టర్ అవదేశ్ కుమార్ సింగ్, డాక్టర్ రితుసింగ్ ముంబై లోని లీలావతి ఆస్పత్రికి చెందిన డాక్టర్ శశాంక్ జోషి, ఢిల్లీ లోని నేషనల్ డయాబెటిస్, ఒబెసిటీ ఫౌండేషన్‌కు చెందిన డాక్టర్ అనూప్ మిశ్రా సంయుక్తంగా చేపట్టిన ఈ పరిశోధనలో అరుదుగా వచ్చే ఈ ఇన్‌ఫెక్షన్ చాలా ప్రమాదకరమైనదిగా వెల్లడించారు. ఇప్పటివరకు నమోదైన కేసులను పరిశీలిస్తే వారిలో 79 శాతం మంది పురుషులే ఉన్నట్టు చెప్పారు. ఇది వ్యాపించిన వంద మందిలో 83 మంది మదుమేహ రోగులేనని తేలిందన్నారు. వీరిలో మరణాల శాతం కూడా ఎక్కువగా ఉన్నట్టు గుర్తించామన్నారు.

కాబట్టి కరోనా నుంచి కోలుకున్న వారు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కరోనా పూర్తిగా తగ్గక ముందే శరీరం ఈ ఇన్‌ఫెక్షన్‌కు గురవుతుండగా, కొవిడ్ తగ్గగానే వ్యాధి బయటపడుతుందని చెప్పారు. భారత్‌తోసహా అమెరికా, ఇరాన్‌లో బ్లాక్ ఫంగస్ బాధితులను ఈ పరిశోధనలో పరిశీలించారు. బ్లాక్‌ఫంగస్ సాధారణంగా ముక్కు, సైనస్, నాడీ వ్యవస్థ ఊపిరితిత్తులు, పేగులు, చర్మం, దవడ, ఎముకలు, కీళ్లు, గుండె, మూత్రపిండాలపై ప్రభావం చూపుతుంది. కరోనా శ్వాసవ్యవస్థపై ప్రభావం చూపుతుండడంతో ప్రస్తుతం ఈ ఇన్‌ఫెక్షన్‌కు ముక్కు, సైనస్ ప్రాంతాల్లో ఎక్కువగా గుర్తిస్తున్నారు. తక్కువ ఆక్సిజన్ స్థాయిలు, రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు ఎక్కువగా ఉండి తెల్ల రక్తకణాల సంఖ్య తక్కువ ఉన్నవారిలో ఇది తీవ్ర ప్రభావం చూపుతుందని పరిశోధకులు వివరించారు. ప్రభుత్వాలు ఇప్పటికైనా కార్డికో స్టెరాయిడ్స్ వాడకాన్ని నియంత్రించే చర్యలు తీసుకోవాలని పరిశోధకులు డాక్టర్ శశాంక్ జోషి సూచించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News