బీహార్ ఎన్నికల మేనిఫెస్టోలో ఆర్జెడి వాగ్దానం
పాట్నా: బీహార్ సమగ్రాభివృద్ధే మా లక్ష్యమన్న వాగ్దానంతో రాష్ట్రీయ జనతా దళ్(ఆర్జెడి) శనివారం బీహార్ అసెంబ్లీ ఎన్నికలను పురస్కరించుకుని మేనిఫెస్టో విడుదల చేసింది. రాష్ట్రాన్ని సమగ్రంగా అభివృద్ధి చేస్తూ అద్భుత బీహార్గా తీర్చిదిద్దడమే తమ లక్షమని ఆర్జెడి నాయకుడు, మహాగట్బంధన్ ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వి యాదవ్ ప్రకటించారు. 16 పేజీలతో కూడిన పార్టీ మేనిఫెస్టోలో ప్రధానంగా ఉపాధి, మహిళా సాధికారత, ఆగ్రో పరిశ్రమలు, విద్య, స్మార్ట్ విలేజ్, పంచాయతీ రాజ్, పేదరికం, సమాజాభివృద్ధి, వైద్యారోగ్య సేవలు వంటి అంశాలపై దృష్టిపెట్టారు.
తాము అధికారంలోకి వస్తే 10 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని తేజస్వి ప్రకటించారు. సమాన పనికి సమాన వేతనం కూడా తమ ఎన్నికల వాగ్దానమని ఆయన చెప్పారు. ఒక కోటి ఉద్యోగాలు ఇస్తామని కూడా వాగ్దానం చేయవచ్చని, కాని తాను అలా చెప్పనని, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగే తొలి క్యాబినెట్ సమావేశంలోనే తమ మాట నిలబెట్టుకుంటామని ఆయన తెలిపారు. ఒకేసారి 10 లక్షల ఉద్యోగావకాశాలు కల్పించి తాము దేశంలోనే మొదటిసారి ఆ ఘనతను సాధిస్తామని ఆయన చెప్పారు. ప్రస్తుతం మన రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలన్నీ ఒకేసారి భర్తీ చేసి తమ నిజాయితీని నిరూపించుకుంటామని ఆయన స్పష్టం చేశారు.రాష్ట్రంలో టీచర్లు, ప్రొఫెసర్లు, జూనియర్ ఇంజనీర్లు, డాక్టర్లు, నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్లకు సంబంధించిన ఖాళీలు లక్షల్లో ఉన్నాయని, వాటిని తాము భర్తీ చేస్తామని ఆయన తెలిపారు.