మెల్బోర్న్: భారత స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ బుధవారం జట్టులో చేరాడు. రెండు వారాల క్రితమే ఆస్ట్రేలియా చేరుకున్న రోహిత్ క్వారంటైన్లో ఉన్నాడు. క్వారంటైన్ ముగియడంతో అతను టీమిండియాలో చేరాడు. గాయం కారణంగా పరిమిత ఓవర్ల సిరీస్తో పాటు తొలి రెండు టెస్టులకు రోహిత్ అందుబాటులో లేకుండా పోయాడు. ఇక గాయం నుంచి కోలుకోవడంతో బిసిసిఐ రోహిత్ను ఆస్ట్రేలియాకు పంపించింది. 14 రోజుల క్వారంటైన్ పూర్తి కావడంతో రోహిత్ జట్టుతో జతకట్టాడు. రోహిత్ జట్టులో చేరిన విషయాన్ని యాజమాన్యం అధికారికంగా ప్రకటించింది. మరోవైపు రెండో టెస్టులో చారిత్రక విజయం సాధించిన టీమిండియాకు రోహిత్ రాక మరింత సానుకూలంగా మారింది. విరాట్ కోహ్లి అందుబాటులో లేని సమయంలో రోహిత్ జట్టులో చేరడంతో సహచరుల్లో కొత్త జోష్ కనిపిస్తోంది.
ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే సత్తా కలిగిన రోహిత్ జట్టులో కీలక ఆటగాడిగా పేరు తెచ్చుకున్నాడు. ఫార్మాట్ ఏదైన పరుగుల వరద పారించడం రోహిత్ అలవాటుగా మార్చుకున్నాడు. అయితే, వరుస గాయాలు అతన్ని వెంటాడుతున్నాయి. ఐపిఎల్లో కూడా గాయంతో చాలా మ్యాచ్లకు దూరంగా ఉండాల్సి వచ్చింది. అయినా నాకౌట్ మ్యాచులు ఆడిన రోహిత్ ముంబై ఇండియన్స్కు ఐపిఎల్ ట్రోఫీ సాధించి పెట్టాడు. కాగా గాయం నుంచి పూర్తిగా కోలుకోక పోవడంతో రోహిత్ను వన్డే, ట్వంటీ20 సిరీస్లకు ఎంపిక చేయలేదు.
కేవలం టెస్టు సిరీస్కు మాత్రమే జట్టులో చోటు కల్పించారు. కానీ కరోనా నేపథ్యంలో అమలు చేస్తున్న నిబంధనల వల్ల తొలి రెండు టెస్టులను ఆడలేక పోయాడు. ఇక మూడో టెస్టుకు రోహిత్ అందుబాటులో ఉన్నా ఫిట్నెస్ నిరూపించుకుంటేనే అతనికి తుది జట్టులో చోటు దక్కే అవకాశాలున్నాయి. రెండో టెస్టులో మయాంక్ అగర్వాల్ విఫలం కావడంతో అతనికి బదులు రోహిత్ను ఆడించే అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి. కానీ దీని కంటే ముందు ఫిట్నెస్ పరీక్షలో రోహిత్ పాస్ కావాల్సి ఉంటుంది.
Rohit Sharma joins Team India in Melbourne