అర్జున కోసం ఇషాంత్, ధావన్, దీప్తి నామినేట్
ముంబై: ప్రతిష్టాత్మకమైన రాజీవ్ గాంధీ ఖేల్ రత్న పురస్కారం కోసం టీమిండియా స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మను భారత క్రికెట్ బోర్డు (బిసిసిఐ) ప్రతిపాదించింది. క్రీడల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచే వారికి రాజీవ్ ఖేల్ రత్నతో సత్కరించడం అనవాయితీ. ఇక, ఓపెనర్, వైస్ కెప్టెన్గా టీమిండియాకు చిరస్మరణీయ సేవలు అందిస్తున్న రోహిత్ శర్మకు రాజీవ్గాంధీ ఖేల్ రత్న పురస్కారం అందించాలని బిసిసిఐ కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదించింది. ఈ అత్యున్నత పురస్కారం కోసం రోహిత్ పేరును ప్రభుత్వానికి సిఫార్సు చుసింది. ఇక, అర్జున అవార్డు కోసం స్టార్ ఓపెనర్ శిఖర్ ధావన్, వెటరన్ ఫాస్ట్ బౌలర్ ఇషాంత్ శర్మ, మహిళా క్రికెటర్ దీప్తి శర్మ పేర్లను నామినేట్ చేసింది. అసాధారణ ఆటతో భారత్ విజయాల్లో కీలక పాత్ర పోషించిన వీరికి ఈ అవార్డులతో సత్కరించాలని బిసిసిఐ కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది.
రోహిత్ శర్మతో కలిసి శిఖర్ ధావన్ పరిమిత ఓవర్ల క్రికెట్లో ఎన్నో చారిత్రక విజయాలు అందించిన విషయం తెలిసిందే. వీరిద్దరూ ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత విజయవంతమైన ఓపెనర్లుగా పేరు తెచ్చుకున్నారు. ముఖ్యంగా వన్డేల్లో, టి20 ఫార్మాట్లో రోహిత్ధావన్లు కలిసి ఎన్నో సెంచరీ భాగస్వామ్యాలు నెలకొల్పారు. ఇక టెస్టుల్లో ఇషాంత్ శర్మ అద్భుత బౌలర్గా పేరు తెచ్చుకున్నాడు. పలు టెస్టుల్లో భారత్కు ఒంటిచేత్తో విజయాలు సాధించి పెట్టాడు. దీంతో అతని సేవలకు గుర్తింపుగా అర్జున అవార్డు కోసం ఇషాంత్ పేరును బిసిసిఐ ప్రతిపాదించింది. మరోవైపు మహిళా క్రికెట్లో అద్భుత ఆల్రౌండర్గా పేరు తెచ్చుకున్న దీప్తి శర్మ పేరును కూడా అర్జున కోసం నామినేట్ చేసింది. కాగా, 2020 సంవత్సరానికిగాను క్రీడా పురస్కారాల కోసం ఇటీవలే కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ దరఖాస్తులను ఆహ్వానించిన విషయం తెలిసిందే.