ఎందుకింత దుమారమో అర్థం కావడం లేదు
పూర్తి ఫిట్నెస్ కోసమే ఎన్సిఎలో చేరా
గాయంపై తొలిసారి పెదవి విప్పిన రోహిత్
న్యూఢిల్లీ : తొడకండరాల గాయంనుంచి కోలుకొంటున్నానని, త్వరలోనే పూర్తి ఫిట్నెస్ సాధిస్తానని టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ చెప్పాడు. ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్కు ముందు తనలో ఎలాంటి లోపాలు లేవనే విషయాన్ని స్పష్టం చేయాలనే ఉద్దేశంతోనే బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో ఉన్నట్లు చెప్పాడు. రోహిత్ ఇటీవల ఐపిఎల్లో ముంబయిని అయిదోసారి విజేతగా నిలిపిన విషయం తెలిసిందే. ఆ తర్వాత అతను టీమిండియాతో పాటుగా ఆస్ట్రేలియా వెళ్లకుండా భారత్ తిరిగి వచ్చాడు. తొడకండరాల గాయంతో బాధపడుతున్న అతను ఎన్సిఎలో మెరుగవుతున్నాడు. ఈ క్రమంలోనే రోహిత్ తాజాగా పిటిఐతో మాట్లాడుతూ ఆస్ట్రేలియా టూర్కు సిద్ధమవుతున్నట్లు చెప్పాడు.
అసలేం జరుగుతుందనే దానిపై నాకు స్పష్టత లేదు. ప్రజలు ఏమనుకుంటున్నారో కూడా తెలియదు. అయితే నేనొక విషయం చెప్పదలచుకున్నా. నేను నిరంతరం బిసిసిఐ, ముంబయి ఇండియన్స్ యాజమాన్యంతో చర్చలు జరుపుతున్నా. లీగ్ దశలో గాయపడిన తర్వాత మళ్లీ మైదానంలో అడుగుపెడతానని మా టీమ్కు చెప్పా. ఆ విషయంలో స్పష్టత వచ్చాక పరుగులు చేయడంపై దృష్టిపెట్టా. ఇక ఇప్పుడు తొడకండరాల గాయంనుంచి కోలుకున్నా. ఇప్పుడిప్పుడే మరింత ఫిట్నెస్ సాధిస్తున్నా. అలాగే టెస్టు సిరీస్ ఆడక ముందే పూర్తి ఫిట్నెస్ సాధించాననే నమ్మకం కలగాలి. ఎందుకంటే ఏ విషయంలోను నన్ను వేలెత్తి చూపకూడదని ఆనుకుంటున్నా. అందుకే ఇప్పుడు ఎన్సిఎలో ఉన్నా. ఇలాంటి పరిస్థితిలో ఎవరేమనుకున్నా పట్టించుకోను’ అని రోహిత్ అన్నాడు. ఇప్పుడు 25 రోజులపాటు పూర్తి స్థాయిలో కోలుకుని టెస్టు సిరీస్కు సిద్ధమవ్వాలని అనుకుంటున్నట్లు రోహిత్ చెప్పాడు. తన విషయంలో ఎందుకింత దుమారం చెలరేగిందో అర్థం కావడం లేదన్నాడు.
అలాగే ఐపిఎల్లో ముంబయి జట్టు రాత్రికి రాత్రే విజయవంతమైన జట్టు కాలేదని, దానికంటూ కొన్ని ప్రణాళికలున్నాయని రోహిత్ చెప్పాడు. జట్టు యాజమాన్యం తమను నమ్మిందని, దానితో ఒక బలమైన బృందాన్ని నిర్మించుకున్నామని చెప్పాడు. ఇక ఈ సీజన్లో అద్భుతంగా బౌల్ చేసిన ట్రెంట్ బౌల్ట్ను రోహిత్ కొనియాడాడు. అతను గత ఏడాది ఢిల్లీ తరఫున ఆడాడని, 2020 వేలంలో ఆ జట్టు ్ల వదిలేయడంతో తాము కొనుగోలు చేశామన్నాడు. అతని ఎంపిక పట్ల తాను గర్వంగా ఉన్నానన్నాడు. అలాగే సూర్యకుమార్ యాదవ్ను ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపిక చేయనప్పుడు అతడే వచ్చి తనతో మాట్లాడాడని రోహిత్ గుర్తు చేసుకున్నాడు. ఆ విషయాన్ని వదిలేసి ముంబయికి మ్యాచ్లు గెలిపించేందుకు కృషి చేస్తానని చెప్పాడన్నాడు. దాంతో అతను సరైన మార్గంలోనే పయనిస్తున్నాడనిపించిందన్నాడు.