హైదరాబాద్: తెలంగాణలో కరోనా వేగంగా వ్యాపిస్తుండడంతో ఆ వైరస్ ను నిర్మూలించేందుకు ఒక రోజు మూల వేతనాన్ని ప్రభుత్య ఉద్యోగులు, ఉపాధ్యాయులు విరాళంగా ప్రకటించారు. రూ.48 కోట్ల చెక్ను సిఎం కెసిఆర్కు ఉద్యోగ సంఘాల జెఎసి నాయకులు కారం రవీందర్ రెడ్డి, మమత అందజేశారు. సిఎం సహాయనిధికి ఉపాధ్యాయుల ఒక రోజు వేతనం రూ.48 కోట్లు అందజేశారు. ముఖ్యమంత్రి సహాయనిధికి రెండు కోట్ల రూపాయల విరాళంగా మైక్రోసాఫ్ట్ సిఇఒ సత్యనాదేళ్ల సతీమణి అనుపమ వేణుగోపాల్ ప్రకటించారు. సిఎం కెసిఆర్కు అనుపమ తండ్రి కెఆర్ వేణుగోపాల్ అందజేశారు. సిఎం కెసిఆర్కు పది లక్షల రూపాయల విరాళంగా సినీ హీరో నితిన్ అందించారు. విరాళం ప్రకటించిన అందరికీ సిఎం కెసిఆర్ ధన్యవాదాలు తెలిపారు. కరోనా వైరస్ నియంత్రణ కొరకు విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగులకు వైరస్ సోకకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరామని ఉద్యోగ సంఘాల నాయకులు తెలిపారు. ఎమర్జెన్సీ తప్ప మిగతా ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం ఇవ్వాలని కోరామని, కరోనా వైరస్ కట్టడి కొరకు ఉద్యోగులు చేస్తున్న కృషిని సిఎం కెసిఆర్ అభినందించారని, వైద్య ఆరోగ్య సిబ్బంది చేస్తున్న సేవలు మరిచిపోలేనివని ప్రశంసించారు. తెలంగాణ ఉద్యోగుల జెఎసి తీసుకున్న నిర్ణయంలో కారం రవీందర్ రెడ్డి, మమత, మామిళ్ల రాజేందర్, సత్యనారాయణ, గడ్డం జ్ఞానేశ్వర్, మధుసూదన్ రెడ్డి, వంగ రవీందర్ రెడ్డి, మణిపాల్ రెడ్డి, నర్సింహస్వామి, మల్లారెడ్డి, బాబు, ముజీబ్, ప్రతాప్, క్రిష్ణయాదవ్, వెంకట్, రేచల్, రామినేని శ్రీనివాస్ రావు, మధుకర్, జగన్నాథమ్ ప్రవీణ్ తదితరులు ఉన్నారు.