Friday, March 29, 2024

పెరిగిన సెస్ చార్జీలతో ప్రభుత్వానికి సంబంధం లేదు: సజ్జనార్

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: ప్రభుత్వానికి పెరిగిన సెస్ చార్జీలతో ఎలాంటి సంబంధం లేదని ఆర్టీసి చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ పేర్కొన్నారు. యాదగిరిగుట్టకు 100 మినీ బస్సులను ఉప్పల్ నుంచి ఎండి సజ్జనార్‌తో కలిసి చైర్మన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్మన్ బాజిరెడ్డి మాట్లాడుతూ ఆర్టీసి చార్జీల పెంపు కాదనీ, సెస్ చార్జీలు మాత్రమే పెంచామన్నారు. టోల్ ప్లాజా డబ్బులు టిఎస్ ఆర్టీసి చెల్లిస్తుందని, ఏటా రూ.70 నుంచి రూ.100 కోట్లు ఆర్టీసి నష్టపోతుందన్నారు. ఆర్టీసిని లాభాల్లోకి తీసుకురావడానికే చార్జీల పెంపు అని, ఇంత చేసినా రోజుకు రూ. 6 కోట్లు నష్టపోతున్నామన్నారు. త్వరలోనే కొత్త బస్సులను ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు.
2 వేల మంది అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు: ఎండి సజ్జనార్
ఆర్టీసి ఎండి సజ్జనార్ మాట్లాడుతూ ఆర్టీసిలో స్వచ్ఛంద పదవీ విరమణ కోసం ఉద్యోగులను ఎవరినీ బలవంతం చేయడం లేదని, సుమారుగా 2 వేల మంది అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని ఆయన తెలిపారు. విఆర్‌ఎస్‌కు 2 వేల మంది పేర్లు నమోదు చేసుకున్నారన్నారు. ఉద్యోగుల విఆర్‌ఎస్ సంఖ్యను బట్టి ప్యాకేజీ సిద్ధం చేస్తామని సజ్జనార్ వెల్లడించారు. స్వచ్ఛంద పదవీ విరమణ పథకం అమలు తర్వాత ఉద్యోగ ఖాళీలు భర్తీ చేస్తామన్నారు. యాదగిరిగుట్టకు 100 మినీ బస్సులు అందుబాటులో ఉన్నాయని సజ్జనార్ తెలిపారు. ప్రతి జిల్లా కేంద్రం నుంచి ఉప్పల్ సర్కిల్‌కు బస్సులు ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు. ఉప్పల్ సర్కిల్ నుంచి యాదగిరిగుట్టకు మినీ బస్సులు అందుబాటులోకి తీసుకువచ్చామని ఆయన చెప్పారు. జేబిఎస్ నుంచి రూ.100, ఉప్పల్ నుంచి రూ.75 టికెట్ ధర నిర్ణయించినట్లు వివరించారు. ప్రతి రోజు 104 సర్వీసులు అందుబాటులో ఉంటాయని ఆయన తెలిపారు. ఇతర జిల్లాల నుంచి ప్రత్యేక యాదాద్రి బస్సులను ఏర్పాటు చేస్తున్నామని ఎండి పేర్కొన్నారు. ప్రైవేటు వాహనాల కంటే ఆర్టీసి బస్సుల్లోనే సుఖవంత ప్రయాణం ఉంటుందని ఆయన తెలిపారు.

RTC MD Sajjanar Clarity on Bus Charges hike

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News