Friday, March 29, 2024

18 దేశాలలో డాలరు స్థానంలో రూపాయితో వ్యాపారం!

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలలో ఇప్పుడు రూపాయితో వ్యాపార లావాదేవీలకు ఆస్కారం ఏర్పడింది. రూపాయి విలువ డాలరు స్థాయికి చేరుకుంటోంది. అనేక దేశాలు కూడా ప్రాపంచిక వ్యాపారంలో డీడాలరైజ్‌కు ప్రాధాన్యతనిస్తున్నాయి. అనేక దేశాలు ఇప్పుడు భారత రూపాయి కరెన్సీలో వ్యాపారం చేయడానికి ఆమోదం తెలుపుతున్నాయి. ఇప్పుడు భారత రిజర్వు బ్యాంకు రష్యా, శ్రీలంక సహా 18 దేశాలలో 60 స్పెషల్ రూపీ వోస్ట్రో ఖాతాలు తెరువడానికి ఆమోదం తెలిపింది. భారత ఆర్థిక సహాయ మంత్రి భగవత్ కరద్ పార్లమెంట్‌కు ఈ విషయాన్ని తెలిపారు. ‘దేశీయ, విదేశీ అధీకృత డీలర్(ఏడి) బ్యాంకులు 18 దేశాలలో భారతీయ రూపాయల్లో చెల్లింపులు చేయడానికి బ్యాంకుల ఎస్‌ఆర్‌విఎలను తెరువడానికి భారతీయ రిజర్వు బ్యాంకు ఆమోదం తెలిపింది’ అని ఆయన పార్లమెంటుకు తెలిపారు.

అసలు స్పెషల్ రూపీ వోస్ట్రో ఖాతా(ఎస్‌ఆర్‌విఎ) అంటే ఏమిటి?
ఎస్‌ఆర్‌విఎ ప్రక్రియ గత జూలై నెలలో ప్రారంభమైంది. భారతీయ రూపాయల్లో సరిహద్దేతర వాణిజ్యపు లావాదేవీలకు ఆర్‌బిఐ వివరణాత్మక మార్గదర్శకాలను జారీచేసింది. ‘భారతీయ రూపాయల్లో ఎగుమతులు, దిగుమతుల ఇన్వాయిసింగ్, చెల్లింపులు, సెటిల్‌మెంట్ కోసం అదనపు ఏర్పాటు చేయాలని నిర్ణయించాం’ అని భారత కేంద్ర బ్యాంకు తెలిపింది. ఈ కొత్త యంత్రాంగం ప్రకారం భారత దేశంలోని అధీకృత బ్యాంకులు, భాగస్వామి వాణిజ్య దేశం బ్యాంకుల ఎస్‌ఆర్‌విఎలను తెరవాలి, నిర్వహించాలి. ఎగుమతి, దిగుమతి లావాదేవీల సొమ్మంతా వొస్ట్రో ఖాతాల్లో జమ చేయబడుతుంది. ఎస్‌ఆర్‌విఎ హోల్డర్లు తమ మిగులు బ్యాలెన్స్‌ను భారతీయ ప్రభుత్వ సెక్యూరిటీలలో మదుపు చేయొచ్చు. ఈ కొత్త విధానాన్ని పాపులరైజ్ చేయడానికి ఈ సదుపాయాన్ని ఆర్‌బిఐ కల్పించింది.
భారతీయ రూపాయలలో వ్యాపారం చేయడానికి అనుమతించిన 18 దేశాలు ఇవి:
1.రష్యా, 2.సింగపూర్, 3.శ్రీలంక, 4.బోత్సానా, 5.ఫిజీ, 6.జర్మనీ, 7.గయాన, 8.ఇజ్రాయెల్, 9.కెన్యా, 10.మలేసియా, 11.మారిషస్, 12. మయన్మార్, 13.న్యూజిలాండ్, 14.ఓమన్, 15.సెషల్స్, 16. టాంజానీయ, 17.ఉగాండ, 18. యునైటెడ్ కింగ్‌డమ్.
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News