Friday, April 19, 2024

రైతుబంధు రూ.265.18 కోట్లు రైతుల ఖాతాల్లో జమ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రాష్ట్రంలో రైతుబంధు పథకం కింద సోమవారం రూ.265.18కోట్లను విడుదల చేసినట్టు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి వెల్లడించారు. 1,51,468మంది రైతుల బ్యాంకు ఖాతాలకు నిధులు జమ చేసినట్టు తెలిపారు. ఎకరాకు రూ.5వేలు చొప్పున ఈ నిధులు 5,30,371ఎకరాలకు పెట్టుబడి సాయంగా అందచేసినట్టు తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో కరంటు రాక, సాగునీళ్లు లేక రైతాంగం వ్యవసాయం వదిలేసి వలసబాట పట్టారన్నారు. బోరు బావుల కింద వ్యవసాయం చేయలేక రైతాంగం నష్టాల పాలయ్యారని, కేవలం ఎనిమిదేళ్లలో తెలంగాణ వ్యవసాయరంగ స్వరూపం మారిపోయిందన్నారు. రైతుబంధు, రైతుభీమా, ఉచిత కరంటు పథకాలు చారిత్రాత్మకమైనవని తెలిపారు. వ్యవసాయరంగం బలపడితేనే దేశం పటిష్టంగా ఉంటుందన్నారు.

తెలంగాణ పథకాలు చూసి దేశ రైతాంగం బీఆర్‌ఎస్ వైపు చూస్తోందన్నారు.సంపద పెంచాలి .. ప్రజలకు పంచాలి అన్నదే కేసీఆర్ విధానం అని వెల్లడించారు. ప్రతినెలా 47.75 లక్షల మందికి ఫించన్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ ఒక్కటే అన్నారు. ఇందులో చిన్న, సన్నకారు రైతులు కూడా ఉన్నట్టు తెలిపారు. 11.55 లక్షల మందికి కళ్యాణలక్ష్మి, 12.66 లక్షల మందికి కేసీఆర్ కిట్లు అందించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని తెలిపారు. 2014లో 298 గురుకులాలు ఉంటే నేడు 1201 గురుకులాలు ఉన్నాయన్నారు. విద్య, వైద్యం, వ్యవసాయ, ఉపాధి రంగాలలో గణనీయమైన వృద్ది సాధించామని వెల్లడించారు. బీఆర్‌ఎస్ తో దేశ రాజకీయాల్లో కేసీఆర్ తనదైన ముద్ర వేయడం ఖాయం అని మంత్రి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News