హైదరాబాద్ : కోవిడ్ నియంత్రణ చర్యల్లో భాగంగా రాష్ట్రంలో లాక్డౌన్ అమల్లో ఉన్నందున రాష్ట్రంలో ఒకటవ తరగతి నుంచి 9వ తరగతి వరకు మంగళవారం(ఏప్రిల్ 7) నుంచి జరగాల్సిన వార్షిక పరీక్షలు(ఎస్ఎ 2) పరీక్షలు రద్దయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఎస్ఎ 2 పరీక్షలను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు పాఠశాల విద్యాశాఖ ప్రకటించినప్పటికీ, భవిష్యత్తులో కూడా నిర్వహించే అవకాశాలు కనిపించడం లేదు.
కోవిడ్ 19 విజృంభన నేపథ్యంలో ముందుగానే ప్రభుత్వం పాఠశాలలకు సెలవులు ప్రకటించింది. కేంద్రం ఈ నెల 14వ తేదీ వరకు దేశవ్యాప్తంగా లాక్డౌన్ ప్రకటించడంతో ఇక పరీక్షలు నిర్వహించే అవకాశం లేకుండా పోయింది. దాంతోపాటు ఈ విద్యా సంవత్సరం ఈ నెల 23వ తేదీతో ముగియనుంది. దీంతో పరీక్షలు నిర్వహించే పరిస్థితి కనిపించడం లేదు.
కరోనా వైరస్ నేపథ్యంలో లాక్డౌన్ మరో వారం పొడిగిస్తే అసలు పరీక్షల నిర్వహణ సాధ్యం కాదు. ఈ పరిస్థితుల్లో విద్యార్థులను పైతరగతికి ప్రమోట్ చేయాలని విద్యాశాఖ నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. 9వ తరగతి వరకు విద్యార్థులు పరీక్షలు రాయకుండానే పాస్ చేసేలా విద్యాశాఖ కసరత్తు ప్రారంభించింది. దీనిపై త్వరలో రోజుల్లో ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది. అయితే ఇప్పటివరకు పరీక్షల నిర్వహణపై విద్యాశాఖ నుంచి ఎలాంటి ఉత్తర్వులు వెలువడకపోవడంతో వార్షిక పరీక్షలకు వాయిదా వేశారా..? లేక నిర్వహిస్తారా..? అన్న అంశాలపై విద్యార్థులు, తల్లిదండ్రుల్లో కొంత అయోమయం నెలకొంది. ఈ నెల 14 తర్వాత పరిస్థితులను బట్టి పరీక్షల నిర్వహణ లేదా ఆల్ పాస్ విధానంపై ప్రభుత్వ నిర్ణయం వెలువడే అవకాశం కనిపిస్తోంది.
పలు రాష్ట్రాల్లో ఆల్పాస్ నిర్ణయం
సిబిఎస్ఇ సహా పలు రాష్ట్రాల్లో బోర్డు పరీక్షలు రాసే తరగతుల విద్యార్థులకు మినహా అన్ని తరగతుల విద్యార్థులను పరీక్షలు లేకుండానే ప్రమోట్ చేయాలని నిర్ణయించారు. సిబిఎస్ఇలో ఒకటవ తరగతి నుంచి 8వ తరగతి వరకు ఆల్ పాస్ నిర్ణయం తీసుకోగా, ఆంధ్రప్రదేశ్ సహా తమిళనాడు రాష్ట్రాలు ఒకటవ తరగతి నుంచి 9వ తరగతి వరకు విద్యార్థులందరినీ పరీక్షలు లేకుండానే పై తరగతులకు ప్రమోట్ చేయాలని నిర్ణయించాయి. కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో కూడా ఆల్పాస్ నిర్ణయం తీసుకున్నారు.
ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కరోనా నివారణ చర్యల్లో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న ఒకటి నుంచి 8వ తరగతి చదువుతన్న విద్యార్థులు ఎటువంటి పరీక్షలు రాయకుండానే పై తరగతులకు ప్రమోట్ అయ్యే అవకాశం కల్పించింది. అలాగే మహారాష్ట్ర ప్రభుత్వం కూడా ఒకటి నుంచి 8వ తరగతి చదువుతున్న విద్యార్థులను వార్షిక పరీక్షలు లేకుండానే పై తరగతులకు ప్రమోట్ చేయాలని నిర్ణయం తీసుకుంది. పాత మైసూరు ప్రాంతంలోని సిబిఎస్ఇ పాఠశాలల్లో ఈ సారి పరీక్షలు లేకుండానే విద్యార్థులను పై తరగతులకు పాస్ చేయాలని నిర్ణయించారు.