జైపూర్: రాజస్థాన్ రాజకీయాలు వేడి వేడిగా కొనసాగుతున్నాయి. మంగళవారం కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన సిఎల్పి సమావేశానికి సచిన్ పైలట్ డుమ్మా కొట్టాడు. అతనితో పాటు పలువురు ఎంఎల్ఎలు సమావేశానికి హాజరు కాలేదు. అశోక్ గెహ్లాట్ వర్గం సచిన్ పైలట్ ను పదవుల నుంచి తొలగించాలని పట్టుబట్టింది. దీంతో అతనిని డిప్యూటీ సిఎం, పార్టీ పిసిసి ఛీప్ పదవుల నుంచి తొలగించింది కాంగ్రెస్ అధిష్టానం. పిసిసి బాధ్యతలను గోవింద్ సింగ్ కు అప్పగించింది. రాజస్థాన్ లో గంటగంటకూ రాజకీయ పరిణామాలు మారుతున్నాయి.
పైలట్ పక్షాన నిలిచిన ముగ్గురు మంత్రులను కూడా మంత్రి వర్గం నుంచి అధిష్టానం తప్పించింది. ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా ఓ ప్రకటనలో పేర్కొన్నారు. గెహ్లాట్ ప్రభుత్వంపై పైలట్ తిరుగుబాటు చేయడంతో రాజస్థాన్ లో రాజకీయ సంక్షోభం నెలకొంది. దీంతో రంగంలోకి దిగిన కాంగ్రెస్ రాహుల్, ప్రియాంక గాంధీలు పైలట్ ను బుజ్జగించినప్పటికీ లైట్ గా తీసుకున్నారు. సిఎల్పి సమావేశానికి రావాలని రెండుసార్లు ఆహ్వానించినా సచిన్ డుమ్మా కొట్టడంతో అతనిని పార్టీ నుంచి తొలగించడమే మంచిదని పార్టీ తీర్మానించింది. అందులో భాగంగానే రాజస్థాన్ గవర్నర్ ను సిఎం గెహ్లాట్ కలిశారు. సచిన్ పైలట్ను డిప్యూటీ సిఎం పదవి నుంచి తొలగించాలని అశోక్ గెహ్లాట్ చేసిన ప్రతిపాదనను రాజస్థాన్ గవర్నర్ కల్ రాజ్ మిశ్రా అంగీకరించారు. బిజెపి కుట్రలు తమకు తెలుసని గెహ్లాట్ పేర్కొన్నారు. బిజెపి కుట్రలో సచిన్ పైలట్ కు భాగముందని ఆయన ఆరోపిస్తున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ వేటు తర్వాత ఎప్పటికైనా నిజమే గెలుస్తుందని సచిన్ పైలట్ ట్వీట్ చేశారు.
Sachin Pilot sacked as deputy CM