మనతెలంగాణ/హైదరాబాద్: గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్ఫూర్తిదాయకంగా సాగుతుంది. రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్కుమార్ స్వీకారం చుట్టిన ఈ కార్యక్రమం రెండు దశలను పూర్తి చేసుకుని మూడవ దశలోకి వెళ్లింది. సెలబ్రెటీలు, రాజకీయ నాయకులు, అధికారులు, ప్రజాప్రతినిధులతో పాటు అన్నివర్గాల ప్రజలు మొక్కలు నాటుతూ సామాజిక బాధ్యత చాటుతున్నారు. ఈ నేపథ్యంలో గ్రీన్ఇండియా ఛాలెంజ్ 2వదశలో మొక్కలు నాటి తన కోడలు సమంతకు అక్కినేని నాగార్జున సవాల్ విసిరారు. ఛాలెంజ్ స్వీకరించిన సమంత గ్రీన్ ఇండియా 3వ విడతలో మొక్కలు నాటారు. శనివారం జూబ్లిహిల్స్లోని తన నివాసంలో సమంత కుటుంబ సభ్యులతో కలిసి మూడు మొక్కలు నాటారు. అనంతరం సమంత మాట్లాడుతూ జోగినపల్లి సంతోష్కుమార్ ప్రారంభించిన ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. పెరిగిపోతున్న కాలుష్యానికి గ్రీన్ఇండియా ఛాలెంజ్ వెపన్లా పనిచేస్తుందన్నారు. కాలుష్యానికి బ్రేక్ వేయడానికి ఇది ఒక మంచి కార్యక్రమం అన్నారు. కాలుష్యాన్ని తరిమివేసేందుకు ప్రతి ఒక్కరూ గ్రీన్ఛాలెంజ్లో భాగస్వాములు కావాలని ఆమె పిలుపునిచ్చారు. తన అభిమానులంతా మూడు మొక్కలు నాటాలని ఆమె చెప్పారు. గ్రీన్ఇండియా ఛాలెంజ్లో భాగంగా కో స్టార్ మహానటి కీర్తి సురేష్, టాలీవుడ్ బ్యూటీ రష్మిక మందాన్నకు సమంత ఛాలెంజ్ విసిరారు. ఇంత అద్భుతమైన కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్లుతున్న ఎంపి సంతోష్కుమార్కు కృతజ్ఞతలు తెలిపారు.
సమంతను అభినందించిన ఎంపి సంతోష్
అక్కినేని నాగార్జున నుంచి గ్రీన్ ఛాలెంజ్ తీసుకుని మొక్కలు నాటిన హీరోయిన్ సమంతకు రాజ్యసభ సభ్యుడు సంతోష్కుమార్ ధన్యవాదాల తెలిపారు. రాబోయే తరాలకు మంచి వాతావరణం అందించే ఈ కార్యక్రమంలో మీరు భాగస్వాములయ్యారు. మీరు చేసిన ఛాలెంజ్ను మీ అభిమానులు స్వీకరించి మొక్కలు నాటి గ్రీన్ ఛాలెంజ్ను మరింత విస్తృత పరుస్తారని ఆశిస్తున్నట్లు ఆయన ట్విట్టర్లో పేర్కొన్నారు.
Samantha takes up Green Challenge