Tuesday, April 23, 2024

సమ్మక్క, సారాలమ్మ మహాజాతరను ఘనంగా నిర్వహించుకుందాం

- Advertisement -
- Advertisement -

జాతరకు వచ్చే భక్తులకు అన్ని వసతులు కల్పించాలి
జాతరకు వంద రోజుల సమయం మాత్రమే ఉంది
వెంటనే అభివృద్ధి పనులను ప్రారంభించాలి
అధికారుల సమీక్షలో మంత్రి సత్యవతి రాథోడ్

Sammakka sarakka jatara 2021

మనతెలంగాణ/హైదరాబాద్:  ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర అయిన మేడారం సమ్మక్క, సారాలమ్మ మహాజాతరను ఘనంగా నిర్వహించుకుందామని మంత్రి సత్యవతి రాథోడ్ పేర్కొన్నారు. వచ్చే ఏడాది జాతర జరుగనున్న నేపథ్యంలో ఏర్పాట్లపై శనివారం సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ జాతరకు వచ్చే భక్తులకు అన్ని వసతులు కల్పించి అమ్మవారి ఆశీస్సులు పొందేవిధంగా సమష్టిగా కృషి చేయాలని ఆమె అధికారులకు సూచించారు. గతంలో జాతర నిర్వహించిన సమయంలో ఎదురైన ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ఈ సారి మరింత మెరుగ్గా పని చేయాలని ఆమె ఆదేశించారు. గత జాతర పూర్తయ్యాక కరోనా లాక్‌డౌన్ పెట్టుకున్నామన్నారు. జాతరకు వంద రోజుల సమయం మాత్రమే ఉందని, సిఎం కెసిఆర్ జాతరకు భారీగా నిధులు మంజూరు చేశారని ఘనంగా జరుపుకుందామన్నారు.
గతంలో రూ.75కోట్లతో శాశ్వత నిర్మాణాలు
జాతరకు సంబంధించి ఏఏ ఇబ్బందులున్నాయని ఇప్పటికే గుర్తించారని, చుట్టు పక్కల జరిగే చిన్న జారతలకు కూడా నిధులు కేటాయించ నున్నట్లు ఆమె పేర్కొన్నారు. పకడ్బందీగా మౌలిక వసతులు కల్పించనున్నట్లు పేర్కొన్నారు. గతంలో రూ.75కోట్లతో శాశ్వత నిర్మాణాలు చేపట్టినట్లు ఆమె చెప్పారు. ఈ సారి అధికారులంతా కలిసికట్టుగా పని చేసి, జాతరకు వచ్చే భక్తులకు అన్ని వసతులు కల్పించాలన్నారు. ఇప్పటికే రూ.120కోట్ల ప్రతిపాదనలు కలెక్టర్ ప్రభుత్వానికి ఇచ్చారన్నారు. మూడు చెక్‌డ్యాంలను తొలగించాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించామని, అదనపు ఓహెచ్‌ఆర్సీలు నిర్మించనున్నట్లు ఆమె పేర్కొన్నారు. అదనపు బ్లాక్స్, నూతన డైనింగ్ హాల్స్ కట్టనున్నట్లు తెలిపారు. స్థానికంగా నేల స్వభావంతో రోడ్లు కుంగుతున్నాయని, వీటికి మరమ్మతులు చేయాలని ఆమె ఆదేశించారు.
పోలీసులకు శాశ్వతంగా వసతులు
జంపన్న వాగు వద్ద దుస్తులు మార్పిడి చేసుకునేందుకు గదులతో పాటు పోలీసులకు శాశ్వతంగా వసతులు కల్పించనున్నట్లు ఆమె పేర్కొన్నారు. గుంజేడు ముసలమ్మ జాతరకు వసతులు కల్పించాలని విజ్ఞప్తులు వచ్చాయని, ఈ మేరకు వసతులు కల్పించనున్నట్లు ఆమె పేర్కొన్నారు. అలాగే పగిడిద్ద రాజు దగ్గర ఏర్పాట్లు చేయనున్నట్లు మంత్రి తెలిపారు. జాతర విజయవంతం అయ్యేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆమె విజ్ఞప్తి చేశారు.
త్వరలో గిరిజన వర్సిటీ సమస్యకు పరిష్కారం
గిరిజన విశ్వ విద్యాలయం సమస్య త్వరలోనే పరిష్కారం కానుందని మంత్రి సత్యవతి తెలిపారు. గట్టమ్మ దగ్గర డిగ్రీ కాలేజీకి రూ.55కోట్ల కేటాయించినట్లు చెప్పారు. త్వరలోనే టెండర్ పనులు మొదలవుతాయని, మనగపేట దగ్గర ఫ్లడ్ బ్యాంక్ పనులు నిధులు విడుదలయ్యాయని, త్వరలోనే పనులు మొదలవుతాయన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సీతక్క మాట్లాడుతూ గత జాతరలో వచ్చిన సమస్యలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రహదారులు బాగుంటే ట్రాఫిక్ సమస్య తీరుతుందని, తిరుగు జాతర ఏర్పాట్లపై కూడా దృష్టి పెట్టి వసతులు కల్పించాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు. సమీక్షా సమావేశంలో జడ్పీ వైస్ చైర్మన్ నాగజ్యోతి, కలెక్టర్ కృష్ణ ఆదిత్య, అదనపు కలెక్టర్ ఇలా త్రిపాఠీ, ఎస్పీ సంగ్రామ్ సింగ్, ఆర్డీఓ రమాదేవి, గిరిజన సంక్షేమ శాఖ చీఫ్ ఇంజనీర్ శంకర్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ హేమలత, డిటిడివో ఎర్రయ్య, జిల్లా సంక్షేమ అధికారి ప్రేమలత, ఐటిడిఏ ఏపిఓ వసంత్ కుమార్, జడ్పీటీసీలు ఎంపిపిలు, ఎంపిటిసిలు, సర్పంచ్‌లు, ఈఓ రాజేందర్, ప్రధాన పూజారి జగ్గారావు, పూజారులు, నేతలు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News