Thursday, April 18, 2024

సానియా స్టార్ ఛాంపియన్ : కెటిఆర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : టెన్నిస్ క్రీడలో ఎందరో రాణించేందుకు ప్రేరణగా స్టార్ ఛాంపియన్ సానియా మీర్జా నిలిచారని రాష్ట్ర మున్సిపల్, ఐటి, పరిశ్రమల శాఖల మంత్రి కె.తారకరామారావు అన్నారు. జనవరిలో టెన్నిస్ కెరియర్‌కు వీడ్కోలు పలికిన భారతీయ టెన్నిస్ దిగ్గజం సానియా మీర్జా కోరిక మేరకు హైదరాబాద్‌లో ఎల్ బి స్టేడియంలో ఏర్పాటు చేసిన ఫేర్ వెల్ మ్యాచ్ ముగిసింది. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కెటిఆర్,క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా సానియామీర్జాకు జ్ఞాపికను అందజేసి మంత్రి కెటిఆర్ మాట్లాడారు. అంతకుముందు.. తాను ఓనమాలు నేర్చుకొన్న ఎల్బీ స్టేడియంలో స్థానిక అభిమానుల కేరింతలు, చప్పట్ల మధ్య వీడ్కోలు మ్యాచ్‌లో హూషారుగా ఆడింది.

మ్యాచ్ పూర్తయిన తర్వాత సానియా మీర్జా ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యింది. కంటతడి పెట్టింది. కాగా ఈ మ్యాచ్‌లో గతంలో తాను జోడీ కట్టిన గ్రాండ్స్లామ్ చాంపియన్లు రోహన్ బోపన్న, ఇవాన్ డోడిగ్, మాటెక్ శాండ్స్, కారా బ్లాక్, మరియన్ బర్తోలీలతో సానియా పోటీపడింది. తన ట్రేడ్ మార్క్ షాట్లతో అభిమానులను అలరించింది. సానియాకు చివరి మ్యాచ్ కావడంతో అభిమానులు పెద్ద సంఖ్యలో ఎల్బీ స్టేడియానికి తరలివచ్చారు. చప్పట్లు, కేరింతలతో సానియాను ఉత్సాహపరించారు. సినీ హీరో దుల్కర్ సల్మాన్‌తో పాటు పలువురు ప్రముఖలు ఈ మ్యాచ్ను ప్రత్యక్షంగా వీక్షించారు.
* ఇక భవిష్యత్ తరాన్ని తీర్చిదిద్దేందుకే నా సమయం..
మ్యాచ్ అనంతరం సానియా మీర్జా మీడియాతో మాట్లాడుతూ కీలక విషయాలు వెల్లడించారు. బ్యాడ్మింటన్ తరహాలో టెన్నిస్ లోనూ సమర్థమైన వ్యవస్థ నిర్మితం కావాలని ఆకాంక్షిస్తున్నట్టు చెప్పారు. ఇక భవిష్యత్ తరాన్ని తీర్చిదిద్దడం కోసం తన సమయాన్ని వెచ్చిస్తానని ఆమె చెప్పింది. ‘వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడానికి పాలనలో భాగస్వామిని కావాలనుకొంటున్నా. సినిమా రంగంవైపు అడుగులు వేయాలని అనుకోలేదు. బాలీవుడ్ అవకాశం వచ్చినా తిరస్కరించానని మీర్జా వెల్లడించింది.

తన కుమారుడు ఇజాన్‌కు బ్యాడ్మింటన్ అంటే ఎంతో ఇష్టమని చెప్పింది. వింబుల్డన్ జూనియర్ ఛాంపియన్ షిప్ నెగ్గి తొలిసారి ఇక్కడకు వచ్చినప్పుడు లభించిన అపూర్వ స్వాగతం తన జీవితంలో మరువలేని ఘట్టమని వివరించింది. ‘సొంతగడ్డపై నన్ను ఎంతగానో అభిమానించే ఫ్యాన్స్ మధ్య తుది మ్యాచ్‌తో కెరీర్‌కు వీడ్కోలు పలకాలని ఎంతోగానో కోరుకొన్నా. గొప్ప ప్రయాణాన్ని పూర్తి చేసుకొని మొదలెట్టిన చోటికి వచ్చానని సానియా చెప్పిన విషయం తెలిసిందే. కార్యక్రమంలో శాట్స్ చైర్మన్ డాక్టర్ ఆంజనేయగౌడ్, క్రీడ శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా, పరిశ్రమల ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, మాజీ క్రికెట్ క్రీడాకారుడు మహమ్మద్ అజరుద్దీన్,్లయువరాజ్‌సింగ్, హీరో దుల్కర్‌సల్మాన్ సానియా మీర్జా తల్లిదండ్రులు, చాముండేశ్వరినాథ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News