సాధారణ సబ్బులు, నీటితో చేతులు కడుక్కోవడమే ఉత్తమం…
నిపుణుల హెచ్చరిక
మన తెలంగాణ/హైదరాబాద్: శానిటైజర్లు అతిగా వాడినా ముప్పేనని, సాధారణ సబ్బులు, నీటితో చేతులు కడుక్కోవడమే ఉత్తమోత్తమమని నిపుణులు సూచిస్తున్నారు. ప్రపంచ దేశాలను కరోనా మహమ్మారి వణికిస్తోంది. వైరస్ కట్టడిలో భాగంగా చేతులు శుభ్రం చేసుకోవడం ముఖ్యమైన పని. అందులో భాగంగా సబ్బుతో కాకుండా.. ప్రతి ఒక్కరూ శానిటైజర్లను అతిగా వినియోగిస్తున్నారు. దీనివల్ల పెను ప్రమాదమే పొంచి ఉంది. ఇందుకు గల కారణాలను సైతం నిపుణులు విశ్లేషణాత్మకంగా వివరిస్తున్నారు. చేతులను శుభ్రం చేయడానికి వాడే ఈ శానిటైజర్లలో 60 శాతం నుంచి 90 శాతం ఆల్కహాల్ ఉంటుంది. దీనివల్ల చర్మం మండే అవకాశాలు ఎక్కువ. ఇతర సమస్యలూ వస్తాయి.
ఈ ప్రమాదం గృహిణులు, పిల్లల్లో అధికమని వ్యాధి నియంత్రణ నివారణ కే్రందం(సిడిసి) చెబుతోంది. ఆల్కహాల్ అధికంగా ఉన్న శానిటైజర్లు ఉపయోగించిన తర్వాత గ్యాస్స్టవ్, అగ్గిపుల్లలు వెలిగిస్తే.. చేతులకు మంట అంటుకుంటుందని హెచ్చరిస్తోంది. చిన్న పిల్లలకు ఇది మరింత ప్రమాదకరమని చెబుతోంది. ౦5 సంవత్సరాల పిల్లలకు దీనివల్ల తీవ్ర సమస్యలు ఎదుర్కొక తప్పదని సిడిసి స్పష్టపరుస్తోంది. ఒకవేళ ఏమరుపాటున ఈ శానిటైజర్లతో నిండిన చేతులు.. వారి నోటికి చేరితే అది చాలా ప్రమాదకరంగా మారుతుందని, దీనివల్ల వాంతులు, విరోచనలు, గొంతునొప్పి, కడుపునొప్పి సమస్యల బారిన పడక తప్పదని హెచ్చరిస్తోంది. అంతేకాదు వీటివల్ల ఊపిరితిత్తుల సమస్యలు, కోమా, జీర్ణక్రియలో ఇబ్బందులు, తదితర సమస్యలూ ఎదురయ్యే అవకాశాలు లేకపోలేదని చెబుతోంది. అయితే, ఈ విషయంలో మరేం చేయ్యాలి? అన్నదానిపై.. కరోనా వైరస్ను అరికట్టడానికి చేతులు పదేపదే శుభ్రం చేసుకోవడం ముఖ్యమే అయినప్పటికీ శానిటైజర్ల స్థానంలో ప్రత్యామ్నాయ పద్ధతులు పాటించాలని, అందుకు సాధారణ సబ్బులు, నీటితో చేతులు కడుక్కోవాలని నిపుణులు సూచిస్తున్నారు.