సంజయ్ దత్ ప్రకటన
ముంబయి: ప్రముఖ బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ క్యాన్సర్ను ఓడించారు. బుధవారం తన ఆరోగ్య పరిస్థితిపై అభిమానులకు ఒక ప్రకటన చేసిన సంజయ్ దత్త క్యాన్సర్పై పోరాటంలో తాను విజయం సాధించినట్లు వెల్లడించారు. గత కొద్ది నెలలుగా తాను, తన కుటుంబం క్లిష్ట సమయాన్ని ఎదుర్కొన్నామని, కాని ఎట్టకేలకు తాను క్యాన్సర్ నుంచి పూర్తిగా విముక్తి పొందానని ఆయన తెలిపారు. దేవుడు తన భక్తులకే అష్టకష్టాలు పెడతాడని పెద్దలు అంటారని, తన కవల పిల్లలు కుఆర్తె ఇఖ్రా, కుమారుడు షరాన్ల పుట్టినరోజు సందర్భంగా తాను ఈ యుద్ధంలో విజేతనై సంపూర్ణ ఆరోగ్యంతో వారికి ఈ బహుమతిని ఇస్తున్నానని ఆయన ఉద్వేగంగా తెలిపారు.
అభిమానుల అండదండలు, విశ్వాసం లేకుండా ఇది సాధ్యపడేది కాదని, ఈ కష్టకాలంలో తనకు మద్దతుగా నిలిచిన తన కుటుంబానికి, మిత్రులకు, అభిమానులకు తాను రుణపడి ఉంటానని ఆయన పేర్కొన్నారు. తన ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపిన వైద్యులకు, వైద్య సిబ్బందికి కూడా ఆయన ధన్యవాదాలు తెలిపారు. గత కొద్దిరోజులుగా తనకు వైద్య చికిత్స అందచేసిన కోకిలాబెన్ ఆసుపత్రికి చెందిన డాక్టర్ సేవంతి, ఆమె నేతృత్వంలో పనిచేసిన డాక్టర్లు, నర్సులు, వైద్య సిబ్బందికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.