రెండింళ్లు ధ్వంసం, పలువురికి సల్ప గాయాలు
జనగాం : బహుజన రాజ్యస్థాపకుడు గోల్కొండ సింహాసనాన్ని అధిష్టించిన బహుజన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న నిర్మించిన కోట గురువారం భారీ వర్షానికి పాక్షికంగా నేలమట్టమైంది. జనగాం జిల్లా రఘునాథ్పల్లి మండలం, ఖిలాషాపురంలో ఉన్న ఈ కోట బీటలు వారి నేలమట్టం కావడం వల్ల రెండింళ్లు పాక్షికంగా ధ్వంసమయ్యాయి. పలువురికి స్వల్పగాయాలయ్యాయి. నైజాం పాలనలో బహుజన రాజ్యాన్ని స్థాపించడానికి సర్వాయి పాపన్న ఖిలాషాపురం నుండే పోరాటాన్ని చేసి గోల్కొండ సింహాసనాన్ని అధిష్టించి రాజ్య పరిపాలన చేశారు. ఆయన పోరాటానికి స్పూర్తిగా తన గ్రామాన్ని శత్రు దుర్భేగ్యంగా భారీ కోటను నిర్మించారు.
మట్టి, ఇటుక, రాతితో నిర్మించారు. వందల సంవత్సరాలు చరిత్ర కలిగిన ఈ కోట ఇప్పటి వరకు చెక్కు చెదరకుండానే ఉంది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఆ కోట తూర్పు ఉత్తర ముఖం మూలభాగం బీటలు వారింది. గురువారం ఉదయం కోట ఒకపక్క కూలే అవకాశం ఉందని గ్రామస్తులు అప్రమత్తమయ్యారు. దానిపక్కన రోడ్డును ఆనుకొని ఉన్న ఇంటి యజమానులను ఖాళీ చేయించారు. గ్రామస్తులంతా చూస్తుండగానే మూలభాగం నేలమట్టమైంది. ఎంతో చరిత్ర కలిగిన సర్దార్ సర్వాయి పాపన్న ఖిలాషాపురం కోట బహుజనుల ధీరత్వం, వీరత్వానికి నిదర్శనంగా పరిఢవిల్లుతుంది. కాగా నేలవాలిన కోట ఉత్తర, తూర్పు ముఖం మళ్లీ నిర్మించి తీరుతామని బహుజన సంఘాలు పేర్కొంటున్నారు.